Thursday, July 13, 2017

అర్మేనియా డైరీ

A quote from the Dalai Lama "Once a year, go somewhere you have never been before"
హైదరాబాదులో ఉన్న అబిడ్స్ ప్రాంతానికి ఆ పేరు రావటానికి కారణం అర్మేనియా దేశానికి చెందిన ఒక వ్యాపారి. ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ ని పాలించే సమయంలో అర్మేనియాకి చెందిన ఆల్బర్ట్ అబిద్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో ఒక దుకాణం నడిపేవాడు.అందువల్ల ఆ ప్రాంతాన్ని అబిద్ షాప్ అని పిలిచేవారు. కాలక్రమేణా అది అబిడ్స్ అయ్యింది.ఇది మన తెలుగు నేలకి అర్మేనియా కి ఉన్న అనుభంధం. ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశానికి సెలవలకి వెళ్ళటం రివాజు. ఇంతకుముందు భార్గవి నేనూ యూరప్ దేశాలు, గత నాలుగేళ్లుగా దుబాయ్ లో నివాసం ఉండటంతో పక్కనున్న గల్ఫ్ దేశాలన్నీ కవర్ చేసేశాం. ఇక సంవత్సరం మాతో పాటు మా అబ్బాయి హన్ష్ కూడా మాకు తోడయ్యాడు. అర్మేనియా దేశాన్ని ఈ సంవత్సరం మా పర్యటనకి ఎంచుకున్నాం.
మే 19 వ తేదీ ఉదయం 11.40 గంటలకి దుబాయ్ నుండి ఫ్లై దుబాయ్ విమానంలో అర్మేనియా రాజధాని నగరమైన యెరవాన్ కి పయనమయ్యాం. టికెట్లు, హోటల్ ఏర్పాట్లు అన్నీ ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుక్ చేసుకోవటంతో మాకు పెద్దగా ఇబ్బంది ఏమి లేదు.దుబాయ్ నుండి యెరవాన్ మూడు గంటల ప్రయాణం.మధ్యాహ్నం మూడు గంటలకల్లా యెరవాన్ లోని జావార్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో లాండ్ అయ్యాం.దుబాయ్ మరియు అర్మేనియా సమయాల్లో తేడా ఏమీ లేదు.ఈ రెండు దేశాలు భారత కాలమానం కంటే గంటన్నర వెనక వుంటాయి.
దుబాయ్ లో నివాస వీసా ఉండే భారతీయులకి అర్మేనియా ఆగమానంతర వీసా సదుపాయం కల్పిస్తోంది. ఎయిర్ పోర్ట్ లో పాస్పోర్ట్ చెక్ కంటే ముందే వీసా విభాగం ఉంది. వీసాకి చెల్లించాల్సిన పైకం ఆర్మేనియా కరెన్సీ లోనే చెల్లించాలి. అర్మేనియా కరెన్సీ పేరు డ్రామ్, ఒక డాలర్ కి 477 డ్రాములు వస్తాయి. 21 రోజులు మీరు ఆర్మేనియాలో ఉండాలంటే 3000 డ్రాములు వీసా ఫీజు చెల్లించాలి.అంటే 6 డాలర్లు, మన డబ్బుల్లో అయితే 400 రూపాయలు.18 ఏళ్ల వయసు లోపు వారికి వీసా ఉచితం.మా అబ్బాయి హన్ష్ వయసు 8 నెలలు కావటంతో తనకి వీసా చార్జీలు లేవు.వీసా కౌంటర్ పక్కనే ఉన్న కరెన్సీ ఎక్స్చేంజి లో 100 డాలర్స్ మార్చుకుంటే 47700 అర్మేనియా డ్రాములు వచ్చాయి.6000 డ్రాములు చెల్లించి నేను నా శ్రీమతి భార్గవి వీసా తీసుకున్నాం. ఎయిర్పోర్ట్ బయటకి రాగానే ట్రావెల్ ఏజెంట్ మా పేర్లు ఉన్న ప్లకార్డు తో నిలబడి ఉన్నాడు. మాతో పాటు దుబాయ్ నుండి మరో 9 మంది అదే ట్రావెల్ ఏజెంట్ ద్వారా వచ్చారు. అందరిని కలిపి 18 సీట్స్ ఉన్న ఒక మినీ బస్సులో కూర్చోబెట్టారు. మా గైడ్ పేరు మేరీ, చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతోంది. మేము మొత్తం 4 రోజులు ఈ దేశంలో ఉండబోతున్నాం. అయితే కేవలం రెండు రోజులకి మాత్రమే మేము ట్రావెల్ ఏజెంట్ దగ్గర లోకల్ టూర్స్ తీసుకున్నాం. నాకు చరిత్ర అంటే ఉన్న ఆసక్తి వల్ల ఈ టూర్ ప్యాకేజీలో లేని కొన్ని ప్రదేశాలని సందర్శించాలని నిశ్చయించుకోవటంతో మిగతా 2 రోజులు వాటి కోసమే అట్టిపెట్టుకున్నాను.బస్సు బయలుదేరగానే మా గైడ్ మేరీ తనను తాను పరిచయం చేసుకుని మా వివరాలు అడిగింది. అందరం పరిచయం చేసుకున్నాక యెరవాన్ గురించి చెప్పటం ప్రారంభించింది.
ప్రపంచంలో ఉన్న అతి పురాతన నగరాల్లో యెరవాన్ ఒకటి. క్రీస్తు పూర్వం 782 వ సంవత్సరంలో ఆర్గిష్టి 1 అనే రాజు ఏరేబుని కోట నిర్మాణంతో ఈ నగరానికి పునాది వేసాడు. ఏరేబుని ఒక గొప్ప పరిపాలన మరియు మతపరమైన కేంద్రంగా, పూర్తిగా రాజధానిగా రూపొందించబడింది.తరువాత కొంత కాలానికి కొత్త రాజధాని నగరాలు స్థాపించబడి, యెరవాన్ ప్రాముఖ్యత తగ్గింది.ఇరాన్ మరియు రష్యన్ పాలనలో 1736 నుండి 1828 వరకు కొంత వైభవాన్ని పొందింది. 1850 నుండి 1917 వరకు ప్రత్యేక గవర్నరేట్ గా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, ఒట్టోమన్ సామ్రాజ్యం పతనమయ్యాక అర్మేనియా గణతంత్ర రాజ్యంగా మారిన పిమ్మట 1918 నుండి నేటి వరకు అర్మేనియాకి రాజధాని గా ఉంది.మొత్తం వెరసి 2800 సంవత్సరాల వయస్సున్న పురాతన నగరం యెరవాన్.
ఇక అర్మేనియా విషయానికి వస్తే అరారత్ పర్వతాల ఒడిలో దాదాపు 5000 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న దేశం ఇది.కానీ ఏనాడు కూడా స్థిరత్వంగా ఉన్న దాఖలాలు లేవు. దీని సరిహద్దులలో పశ్చిమాన టర్కీ, ఉత్తరాన జార్జియా, తూర్పున అజర్బైజాన్, దక్షిణాన ఇరాన్ మరియు అజర్బైజాన్ కు చెందిన నక్షివాన్ ఎన్క్లేవ్లు ఉన్నాయి.ఇది ల్యాండ్ లాక్డ్ దేశం, అంటే భూబంధిత ప్రాంతం. నాలుగు వైపులా భూమి మాత్రమే సరిహద్దుగా ఉంది. ఈ దేశానికి సముద్ర తీర ప్రాంతం లేదు, కేవలం అక్కడపర్వత ప్రాంతాల్లో దొరికే రాగి , బంగారం, తగరం వంటి ఖనిజాల తవ్వకాల మీదనే ఈ దేశం ఆధారపడి ఉంది. ఒకప్పుడు దేశంలో భాగంగా ఉండి, దేశానికి జాతీయ చిహ్నంగా భావించే అరారత్ పర్వతాలు ప్రస్తుతం టర్కీ లో ఉన్నాయి. అయినా సరే వాటిని తమ దేశ జాతీయ చిహ్నంగా భావిస్తారు.బైబిల్ ప్రకారం జల ప్రళయం ఏర్పడినప్పుడు నోవా అనే పెద్దాయన కొన్ని ప్రాణులను ఒక నౌకలో పెట్టి రక్షిస్తాడు. ఆ నౌక అరారత్ అనే కొండ దగ్గరికి చేరుకుందని అర్మేనియన్లు నమ్ముతారు. కొంతకాలం పర్షియన్లు , బైజాంటైన్, మంగోలులు ఈ దేశాన్ని పరిపాలించారు. మరికొంత కాలం తూర్పు , పశ్చిమ అర్మేనియాలుగా విభజించి పశ్చిమాన్ని టర్కీ ఒట్టోమన్ ప్రభుత్వం , తూర్పు భాగాన్ని ఇరాన్ పాలించాయి. అర్మేనియాలో నివసించే జనాభా 30 లక్షలు అందులో దాదాపు 50 శాతం మంది రాజధాని నగరం యెరవాన్ లోనే నివసిస్తారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా మిగతా దేశాలలో ఉన్న ఆర్మేనియన్లు 80 లక్షలు. ఆది నుండి ఈ దేశం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కోవటంతో పలు దఫాలుగా ఇక్కడి పౌరులంతా వలసలు వెళ్లిపోయారు.
ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిన మా బస్సు నగరం వైపు ప్రయాణిస్తోంది. ఇక్కడి ఇళ్ళు అన్నీ పింక్ మరియు లేత పసుపు రంగులో ఉండటం గమనించాం. దీని గురించి మా గైడ్ మేరీ ని అడగగా, ఆలా కనిపించటానికి కారణం ఇక్కడ నిర్మాణాలకు ఉపయోగించే టాఫ్ అనే ప్రత్యేకమైన రాయి. నగరంలో ఉన్న ఇళ్ళు , భవంతులు , పెద్ద పెద్ద కట్టడాలన్నీ ఈ రాతితోనే నిర్మిస్తారు. పింక్ మరియు లేత పసుపు రంగులో వల్కనో బూడిద నుండి ఏర్పడిన ఈ రాయి యెరవాన్ లోని కారాబాగ్ అనే ప్రాంతంలో విరివిగా లభిస్తుంది. 2800 ఏళ్ల క్రితం ఈ నగర నిర్మాణం మొదలైనప్పటినుండి నేటి వరకు కూడా ఇదే రాయిని నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. అందుకే నగరమంతా ఎరుపు , లేతపసుపుల మిశ్రమంగా కనిపిస్తుంది. మేము ఎత్తైన ప్రదేశాలకి వెళ్ళినపుడు కింద ఉన్న నిర్మాణాలన్నీ ఇదే రంగుల్లో కనిపించాయి. ఆధునిక నిర్మాణాలకు కూడా సిమెంట్ గాని సున్నం గాని వేయరు.కేవలం రాళ్ళని నిలబెట్టి వాటి మధ్యలో మాత్రం సిమెంటుతో పూడుస్తారు. పెద్ద ఫ్యాక్టరీల నుండి చిన్న ఇంటి వరకు కూడా ఇదే తరహాలో నిర్మాణం జరుగుతుంది. వేసవిలో చల్లగా , చలికాలంలో వెచ్చగా ఉండటంఈ రాయి ప్రత్యేకత.

ఇలా మేరీ అన్ని విషయాలు చెప్తుండగానే మా బస్సు నగరం మధ్యలో ఉన్న యెరవాన్ రైల్వే స్టేషన్ కి చేరుకుంది. అర్మేనియా రైల్వే వ్యవస్థ పెద్దగా అభివృద్ధి చెందలేదు. కారణం మిగతా దేశాలతో పోలిస్తే అర్మేనియా లో రైలు వినియోగించేవారు తక్కువ. కేవలం స్థానికంగా రెండు మూడు ప్రాంతాలకి మాత్రమే రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. ఇక అంతర్జాతీయ కనెక్టివిటీ చూస్తే, పక్క నున్న టర్కీ , అజర్ బైజాన్ దేశాలతో ఉన్న వివాదాల వల్ల అంతర్జాతీయ రైల్వే వ్యవస్థ కూడా అభివృద్ధి కాలేదు 1993 నుండి టర్కీ , అజర్ బైజాన్ బోర్డర్లు మూసివేయటంతో ఆ రైల్వే లైన్ వినియోగంలో లేదు. కేవలం జార్జియా కి మాత్రమే ఒక రైలు ఉంది.ఆ రైల్వే స్టేషన్ ముందు ఫోటో తీసుకున్నాం.
అక్కడినుండి మా బస్సు రిపబ్లిక్ స్క్వేర్ కి చేరుకుంది.ఇది నగర కూడలి, అప్పటికే సాయంకాలం అవ్వటంతో కూడలి అంతా సందడిగా ఉంది. ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండటంతో అందరూ స్వేట్టర్లు తో కనిపించారు.ఈ కూడలి నిర్మాణం 1926 లో ప్రారంభమై 1977 వరకు నిర్మాణం కొనసాగింది. 1924 లో అలెగ్జాండర్ తామనియాన్ అనే వ్యక్తి ఈ కూడలికి రూపకల్పన చేశాడు.ఈ కూడలి మధ్యలో ఒక ఫౌంటెన్ మరియు చుట్టూ 5 భవనాల నిర్మాణం జరిగింది. ఈ భవనాలన్నీ కూడా అర్మేనియా సంస్కృతికి అనుగుణంగా నిర్మించారు. ఒక ప్రభుత్వ భవనం , చారిత్రక మ్యూజియం ,విదేశాంగ శాఖా కార్యాలయం, మారియట్ హోటల్ మరియు నేషనల్ గేలరీ భవనం ఉన్నాయి. 1950 నాటికి నాలుగు భవనాలు పూర్తవగా నేషనల్ గేలరీ మాత్రం 1977 లో పూర్తయ్యింది. మొదట్లో దీనిని లెనిన్ స్క్వేర్ అని పిలిచేవారట. ఇక్కడ లెనిన్ విగ్రహం కూడా ఉండేది. సోవియట్ నుండి అర్మేనియాకి స్వతంత్రం లభించాక , లెనిన్ విగ్రహాన్ని తొలగించి ఈ కూడలి పేరు కూడా మార్చారు. ఇక్కడ కార్లు, టాక్సీలు కూడా అన్నీ పాతవి మరియు చిన్న కార్లు. ఏదో అక్కడక్కడా తప్ప పెద్ద లగ్జరీ కార్లు కూడా కనపడలేదు.
ఈ విశేషాలన్నీ చూశాక అక్కడినుండి మా బస్సు విక్టరీ పార్క్ అనే ఉద్యానవనం వైపు బయలుదేరింది. రెండవ ప్రపంచ యుద్ధంలో అర్మేనియా దళాలు రష్యా తరపున యుద్ధంలో పాల్గొన్నాయి. 1945 లో ఆ యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా ఈ విక్టరీ పార్క్ ని నిర్మించారు. ఈ పార్క్ లో 22 మీటర్ల ఎత్తు ఉన్న "మదర్ ఆఫ్ అర్మేనియా" విగ్రహం ఉంది. గతంలో ఈ స్థానంలో రష్యా అధ్యక్షుడు స్టాలిన్ విగ్రహం ఉండేదట. 1953 లో స్టాలిన్ మరణించాక 1962 లో ఆయన విగ్రహాన్ని తీసేసి మదర్ ఆఫ్ అర్మేనియా విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించారు. పలు యుద్ధాల్లో భర్తలకు సహకరించిన అర్మేనియా మహిళల వీరత్వానికి గుర్తుగా ఈ విగ్రహాన్ని నెలకొల్పారు.ఈ విగ్రహం కింద ఒక మ్యూజియం కూడా ఉంది. మొదటి , రెండవ ప్రపంచ యుద్ధాలతో పాటు అర్మేనియా పాల్గొన్న యుద్ధాలలో వీరమరణం పొందిన సైనికుల వివరాలు , ఆయుధాలు ఇక్కడ ఉంచారు. మేము వెళ్ళేటప్పటికి ఆలస్యం అవటంతో మ్యూజియం చూడలేకపోయాం. అప్పటికి చలిగాలులతో సన్నటి వర్షం మొదలైంది.
ఇక ఆరోజుకి మా పర్యటన ముగించుకుని నగరానికి కొంచెం దూరంలో ఉన్న కాస్కస్ అనే హోటల్ కి వెళ్లిపోయాం. ఇది నగరానికి కొంచెం దూరంగా ఉన్న 5 నక్షత్రాల హోటల్. మా గైడ్ మేరీ ఆ రోజుకి సెలవు తీసుకుని ఉదయం 9 గంటలకల్లా హోటల్ రెసెప్షన్ లో రెడీగా ఉండమని చెప్పింది. రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యాక హన్ష్ కి రూమ్ లోనే సెరిలాక్ తినిపించేసి ముగ్గురం కిందకి వచ్చాము. బయట వర్షం పడుతోంది , బాగా చలిగా ఉంది.ఈ హోటల్ కి రెండు రెస్టారెంట్లు ఉన్నాయి.ఒక దాంట్లో హెచ్చు స్థాయి సంగీతంతో పార్టీ జరుగుతోంది.మేము పక్కనే ఉన్న మరో రెస్టారెంట్ కి వెళ్ళాం.వెళ్ళగానే బేరర్ ఇచ్చిన మెనూ చూసి చాలా ఆశ్చర్యం వేసింది. ధరలన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. ఆ ధరల్లో మన కర్రీ పాయింట్ లో రెండు కూరలు కూడా రావు. అలాంటిది ఫైవ్ స్టార్ హోటల్ లో చికెన్, మటన్ , చేపతో కూడిన పూర్తి భోజనం లభిస్తోంది.నేను బార్బిక్యూ చికెన్ ఆర్డర్ చెయ్యగా, భార్గవి లాంబ్ విత్ రైస్ ఆర్డర్ చేసింది. మాతో పాటు ఉన్న దుబాయ్ నుండి వచ్చిన మరో ఇద్దరు కూడా అదే రెస్టారెంట్ కి వచ్చారు.అందరం డిన్నర్ ముగించి రూమ్ కి వెళ్లిపోయాం.
మరుసటి రోజు ఉదయం 9 గంటలకల్లా హోటల్ ముందు మా గైడ్ మేరీ సిద్ధంగా ఉంది.అందరం అల్పాహారం ముగించుకుని బస్సు దగ్గరికి చేరుకున్నాం. హన్ష్ చిన్నవాడు కావటంతో అక్కడున్న అందరూ ముద్దు చేసేవారు. ముఖ్యంగా స్థానికులు వాడిని ఎత్తుకుని ఫొటోస్ తీసుకున్నారు. హోటల్ సిబ్బంది అక్కడున్న నాలుగు రోజులు వాడితో బాగా ఆడుకున్నారు. హన్ష్ కూడా ఎవరు ఎత్తుకున్నా అసలు మారాం చేసేవాడు కాదు.అందరి దగ్గరికీ వెళ్ళేవాడు.మేము అక్కడున్న నాలుగు రోజులు కూడా అసలు ఒక్క క్షణం కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వాడు కూడా ట్రిప్ ని ఎంజాయ్ చేసాడు.
ఇప్పుడు మేము వెళ్ళబోయేది లేక్ సెవాన్ అనే మంచినీటి సరస్సు. ఇది సముద్ర మట్టానికి 6250 అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలో రెండవ అతిపెద్ద మంచినీటి సరస్సు. మొదటిది లాటిన్ అమెరికాలోని టిటికాకా సరస్సు.ఇది బొలీవియాలో ఉంది. యెరవాన్ నుండి సెవాన్ 80 కిలోమీటర్లు. దాదాపు 2 గంటల ప్రయాణం. రోడ్లు మీద గుంతలు లాంటివి లేవు కానీ గొప్ప రోడ్లని కూడా చెప్పలేం. వాతావరణం బాగా చల్లగా ఉంది, ఉష్ణోగ్రత 10 డిగ్రీలు చూపిస్తోంది. మేము ప్రయాణించిన రెండు గంటల్లోనే వాతావరణంలో మార్పులన్నీ చూశాం. చలి , వర్షం , ఎండ అన్నీ రెండు గంటల్లో ఒకదాని తర్వాత మరోటి వచ్చాయి.ఇక్కడ వేసవి కాలం జూన్ నుండి సెప్టెంబరు మాసం వరకు ఉంటుంది.ఆ సమయంలో కూడా ఉష్ణోగ్రతలు 22-36 డిగ్రీల సెల్షియస్ మధ్యలోనే ఉంటాయి. మేము వెళ్ళింది మే నెల చివర్లో కనుక ఇంకా వాతావరణం పలు మార్పులకి లోనవుతుంది. మేము వెళ్లే దారి పొడవునా పచ్చటి కొండలు , లోయలు , అక్కడక్కడా మేత మేస్తున్న ఆవులు కనిపించాయి.సగం దూరం వెళ్ళాక రోడ్డుకి పక్కనే రైల్వే ట్రాక్ కనిపించింది. యెరవాన్ నుండి సెవాన్ కి రైల్ మార్గం ఉంది. ఇది మీటర్ గేజి కావటంతో చాలా చిన్న ట్రైన్ వెళ్తుంది. మా గైడ్ మేరీ చెప్తూ తాను చదువుకునే రోజుల్లో స్నేహితులతో కలిసి సరదాగా రైలు లోనే సెవాన్ కి వచ్చేవాళ్ళం అని చెప్పింది.మేము సెవాన్ సరస్సు చేరుకునేటప్పటికీ చలిగాలులు ఉదృతంగా వీస్తున్నాయి. మేము చలికి తగినట్లుగా సిద్ధపడి రావటంతో మా దగ్గర ఉన్న స్వేట్టర్లు , మంకీ కాప్ లు ధరించి కిందకి దిగాం. ఆ సరస్సు చాలా పెద్దది , ఈ గాలుల తాకిడికి సముద్రంలో వచ్చినట్లు సరస్సులో అలలు వస్తున్నాయి. మేము బస్సు దిగగానే గాలుల తాకిడి ఎక్కువవడంతో ఎదురుగా కొండపై ఉన్న ఒక రెస్టారెంట్ లోపలికి వెళ్లి కూర్చున్నాం. కాసేపటికి ఆ గాలుల ధాటికి రెస్టారెంట్ అద్దాలు భళ్ళున పగిలిపోయాయి. అదృష్టవశాత్తు ఆ అద్దాల దగ్గర ఎవరూ లేకపోవటంతో ఎవరికీ ఏమి కాలేదు.ఈ సరస్సు ఎదురుగా ఉన్న కొండపైనా ఒక పురాతన చర్చి ఉంది. అక్కడికి వెళ్తే సరస్సు మొత్తం కనిపిస్తుందట. ఆ గాలిలో మేము హన్ష్ ని తీసుకుని పైకి వెళ్లే సాహసం చేయలేకపోయాము. అక్కడే కాసేపు కూర్చుని కొంత గాలి తగ్గాక సరస్సు ముందు ఫోటోలు తీసుకున్నాం. ఒకప్పుడు 65 అడుగుల లోతు ఉన్న ఈ సరస్సు ఇప్పుడు 40 అడుగులకి తగ్గిపోయింది. చలికాలంలో ఈ సరస్సు గడ్డ కట్టిపోతుందట. అర్మేనియా కి అవసరమైన చేపలలో సింహభాగం ఈ సరస్సు నుండే వస్తాయట. అప్పటికే భోజన సమయం అవ్వటంతో సరస్సు ఒడ్డునే ఉన్న మరో రెస్టారెంట్ కి వెళ్ళాం. సెవన్ లో దొరికే అనేక రకాల చేపలలో సిగా అనేది అరుదైన చేప. మేము వెళ్లిన హోటల్ లో మాకు ఆరోజు అదే భోజనం. మా గైడ్ మేరీ ఈ చేప చాలా బావుంటుందని చెప్పటంతో ఎప్పుడూ అసలు చేప తినని భార్గవి కూడా మొదటిసారి ఆ చేపని రుచి చూసింది. నిజంగానే చేప అసలు వాసన లేకుండా చాలా రుచిగా ఉంది.
ఇక్కడి నుండి మేము వెళ్ళబోయేది గార్ని అనే పట్టణం.సెవన్ నుండి గార్ని 75 కిలోమీటర్లు, దారిలో అన్నీ చిన్న చిన్న గ్రామాల్ని దాటుకుంటూ దాదాపు గంటన్నర ప్రయాణం తరువాత గార్ని చేరుకున్నాం.గార్ని పట్టణం ఒకప్పటి అర్మేనియా రాజులకి వేసవి విడిది.అలాగే అక్కడ ఉన్న క్రీస్తు పూర్వం నాటి గార్ని దేవాలయం అర్మేనియాలో ముఖ్య సందర్శనీయ స్థలాల్లో ఒకటి.ఇది పాగన్ మతానికి చెందిన దేవాలయం. క్రైస్తవానికి పూర్వం అర్మేనియా లో పాగనిజం మరియు జోరాస్ట్రియన్ మతాలూ ఉండేవి. గార్ని దేవాలయం 2100 సంవత్సరాల నాటి నిర్మాణం.యునెస్కో వారసత్వ సంపదగా దీనిని గుర్తించింది. అర్మేనియాలో మిగతా ఏ సందర్శక ప్రాంతానికీ టికెట్ లేదు.ఈ ప్రాంతం చూడాలంటే మాత్రం 2 డాలర్లు రుసుము చెల్లించాలి. టికెట్ తీసుకుని లోపలి కొంత దూరం నడిచాక ఎదురుగా ఎత్తైన పర్వతాల మధ్యలో ఠీవిగా నిలబడ్డ నిర్మాణం కనిపించింది.మేము అందరికంటే ముందు వడి వడి గా ఆ నిర్మాణం లోపలికి చేరుకున్నాం. లోపల ఒక రాతి పీఠం మాత్రం ఉంది.అక్కడ ఒక వ్యక్తి సంగీతం వాయిస్తూ ఉన్నాడు. గైడ్ మేరీ దీని గురించి చెపుతూ ఈ నిర్మాణం చుట్టూ ఉండే 24 స్తంభాలు 24 గంటలని సూచిస్తాయట. అర్మేనియా లో గ్రీకు , రోమన్ శైలిలో నిర్మించబడిన ఏకైక నిర్మాణం ఇది. ఇది ఎప్పుడు కట్టారో సరిగ్గా ఎవరికీ తెలియదు. ఇక్కడ దొరికిన ఆధారాల ప్రకారం క్రీస్తు పూర్వం 77 వ సంవత్సరంలో నిర్మించారని ఒక అంచనా.క్రైస్తవ మతానికి పూర్వం యూరోప్ దేశాల్లో పాగన్ మతం ఉండేది.ఈ మత విశ్వాసాల్ని గురించి ఎక్కడా ఖచ్చితమైన వివరాలు లేవు.ఇది విగ్రహారాధక మతం.యూరోపియన్ మరియు స్కాండినేవియన్ దేశాల్లో క్రైస్తవీకరణ ప్రారంభమయ్యాక క్రమక్రమంగా ఈ పాగనిజం క్షీణించింది. అర్మేనియాలో 3 వ శతాబ్దానికే క్రైస్తవ మతం ప్రవేశించడంతో మిగతా మతాలన్నీ కనుమరుగయ్యాయి. కొంతమంది చరిత్ర కారుల వాదన ప్రకారం ఈ నిర్మాణం దేవాలయం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే క్రైస్తవ మతం వచ్చాక ఇంతకుముందు ఉన్న మతాల గురుతులన్నీ చెరిపివేయబడ్డాయి. ఆ క్రమంలో పాగన్ మతానికి చెందిన దేవాలయాలన్నీ ధ్వంసం చేయబడ్డాయి. ఈ గార్ని దేవాలయం అనేది కేవలం సమాధి మాత్రమే అందువలనే దీనిని నాశనం చేయలేదు అని చెపుతారు. క్రైస్తవం వచ్చాక దీని పక్కనే దీనికన్నా ఎత్తైన చర్చి నిర్మాణం జరిగింది. అయితే ఆ 1679 లో వచ్చిన భూకంపం దాటికి చర్చి మొత్తం కూలిపోయింది. కాని గార్ని దేవాలయం మాత్రం పెద్దగా చెక్కు చెదరలేదు అక్కడక్కడా బీటలు వారింది.దీని పక్కనే కొద్దీ దూరంలో నేల మాళిగలో రోమన్ పవిత్ర స్నానానికి సంభందించిన గదులు ఉన్నాయి.

అర్మేనియాకి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ప్రపంచంలో క్రైస్తవ మతాన్ని అధికారికంగా స్వీకరించిన మొట్టమొదటి దేశం ఇది. క్రీస్తు ముఖ్య శిష్యులైన దాడియస్, బార్తోలోమేవ్ ప్రభావంతో క్రీస్తుశకం 301 వ సంవత్సరంలో అర్మేనియన్లు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. తద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటి క్రైస్తవ దేశంగా అర్మేనియా గుర్తింపు పొందింది. మరో పది సంవత్సరాలకి రోమ్ నగరానికి ఆ హోదా లభించింది.
గార్ని దేవాలయం నుండి మా ప్రయాణం దానికి కొద్ది దూరంలోనే ఉన్న గెగార్డ్ అనే చర్చి దగ్గరకి. గార్ని వెళ్లిన ప్రతి ఒక్కరు తప్పకుండా చూసే ప్రాంతం గెగార్డ్ చర్చి. ఇవి రెండూ కూడా కొద్ది దూరంలోనే ఉంటాయి. మేము బస్ దిగి కొంచెం ఏటవాలుగా ఉన్న ప్రాంతంలోకి నడిచి చర్చి లోపలి చేరుకున్నాం.ఇందులో మొత్తం 3 చర్చిలు ఉన్నాయి. విశేషం ఏమిటంటే ఇవి అన్నీ ఒకే రాతిలో తొలిచిన నిర్మాణాలు. మొదటి చర్చి నాలుగు శతాబ్దంలో రాతి గుహ మాదిరిగా తొలిచారు. తరువాత వరుసగా 8, 10 వ శతాబ్దాల్లో మిగతా రెండు చర్చి లని పక్కనే ఉన్న మరో రాతిలో తొలిచారు. పైకి చూడటానికి మాత్రం ఇదంతా ఒకే నిర్మాణంలా అనిపిస్తుంది. కానీ లోపల మూడు నిర్మాణాలు ఉన్నాయి. వెలుగు కోసం పైన వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. అన్నేళ్ల క్రితం అలాంటి నిర్మాణం ఎలా చేశారా అని ఆశ్చర్యపోయాం. అక్కడినుండి బయటకి వస్తుండగా హల్వాలా కనిపించే కాండీ లు అమ్ముతున్నారు. ఒక దారానికి కాజు పిస్తా లాంటి డ్రైఫ్రూప్ట్స్ గుచ్చి వాటిని హల్వా లాంటి పదార్థంలో ముంచి కాండీ లాగ తయారు చేసి అమ్ముతున్నారు.దీనిని సుజుక్ అంటారు,ఇది చాలా మంచి పోషకాలు కలిగిన ఆహరం. పూర్వం యుద్ధాలకి వెళ్లే సైనికులు ఈ కాండీలని ఆహారంగా తీసుకెళ్లేవారట. ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో పాటు మంచి శక్తిని ఇస్తాయని వీటిని తినేవారట. మేము కూడా 4 క్యాండీలు కొన్నాం.అప్పటికే సాయంకాలం 5 గంటలు అయ్యింది.ఇక్కడి నుండి తిరుగు ప్రయాణం అయ్యి 2 గంటల తర్వాత యెరవాన్ రిపబ్లిక్ స్క్వేర్ కి చేరుకున్నాము. మా గ్రూప్ లో కొంతమంది షాపింగ్ కోసం అక్కడ దిగిపోయారు. మరుసటి రోజు టూర్ ప్లాన్ అంతా మిగతా వారికి చెప్పి గైడ్ మేరీ కూడా మా దగ్గర వీడ్కోలు తీసుకుని మధ్యలోనే దిగిపోయింది. మరుసటి రోజు వారందరూ యెరవాన్ కి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరారత్ పర్వతాల దగ్గరకి వెళుతున్నారు.
మరుసటి రోజు మేము గైడ్ లేకుండానే కొన్ని ప్రాంతాలు చూడాలని నిర్ణయించుకోవటంతో, మాకు అంతకుముందే పరస్పర మిత్రుల ద్వారా పరిచయం అయిన ఆర్మేనియన్ నివాసి, మన తెలుగు వారు అయిన డాక్టర్ లక్ష్మణ్ కుమార్ అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఆర్మేనియాలో మెడికల్ యూనివర్సిటీ మరియు మెడికల్ కాలేజీ ఉన్నాయి. ఇండియా నుండి పలువురు విద్యార్థులు ఏటా ఇక్కడ డాక్టర్ కోర్సు చెయ్యటానికి వస్తుంటారు. ఇండియాతో పోలిస్తే ఇక్కడ డాక్టర్ చదువు చాలా చవక. నివాస ఖర్చులు కూడా తక్కువే, మన దగ్గర అయ్యే ఖర్చులో కేవలం 20 శాతంతో ఇక్కడ డాక్టర్ చదువు అయిపోతుంది. అలాగే ఐదేళ్ల క్రితం ఇక్కడ మెడిసిన్ చదవటానికి వచ్చి ఇక్కడే స్థిరపడిన హైదరాబాద్ కి చెందిన లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడి భాషతో , ఈ దేశంతో మమేకమయ్యారు.అసలు భారతీయులే పెద్దగా కనపడని ఈ దేశంలో మన తెలుగు వారు ఉండటం చాలా సంతోషం అనిపించింది. మరుసటి రోజు ఉదయం లక్ష్మణ్ గారు ఏర్పాటు చేసిన టాక్సీ డ్రైవర్ మాకోసం 9 గంటకల్లా వచ్చాడు. ఇక్కడ ఇంగ్లిష్ మాట్లాడే వారు చాలా అరుదు, టాక్సీ డ్రైవర్ కి కూడా ఇంగ్లీష్ రాదు. ఆ రోజు ప్లాన్ మొత్తం మేము లక్ష్మణ్ గారికి చెప్పటం ఆయన దానిని ఆర్మేనియన్ భాషలో ఆ డ్రైవర్ కి చెప్పటంతో పెద్ద సమస్య లేకుండానే మా మిగతా రెండు రోజుల పర్యటన జరిగింది. ఎప్పటికప్పుడు ఫోన్ లో మమ్మల్ని గైడ్ చేస్తూ , ప్రతి క్షణం జాగ్రత్తలు తీసుకున్న లక్ష్మణ్ కుమార్ గారి ఆదరణ ని ఎన్నటికీ మరచిపోలేము.
ఇంతకుముందు చెప్పుకున్నట్లు మొట్టమొదటగా క్రీస్తు ముఖ్య శిష్యులైన దాడియస్, బార్తోలోమేవ్ ప్రభావంతో క్రీస్తుశకం 301 వ సంవత్సరంలో అర్మేనియన్లు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. 301 మరియు 304 సంవత్సరాల మధ్యలో ఇంతకుముందు పాగన్ దేవాలయం ఉన్న Vagharshapat ప్రాంతంలో Etchmiadzin Cathedral అనే చర్చి నిర్మాణం గావించారు. ఇది ప్రపంచంలో నిర్మించిన తోలి క్రైస్తవ ప్రార్ధనా మందిరం. పర్షియన్ల పాలనా కాలంలో ఇది కొంత ధ్వంసం అయ్యింది. ఇప్పుడు మేము ఈ చర్చి చూడటానికే వెళుతున్నాం. మా హోటల్ నుండి ఈ ప్రాంతానికి 28 కిలోమీటర్లు దూరం ఉంది. హోటల్ నుండి యెరవాన్ నగరం మీదుగా గంట ప్రయాణించాక ఈ చర్చి ఉన్న ప్రాంతానికి చేరుకున్నాం. సన్నగా చినుకులు పడుతున్నాయి. మమ్మల్ని గేట్ దగ్గర దింపేసి డ్రైవర్ పార్కింగ్ లోకి వెళ్ళిపోయాడు. హన్ష్ కార్ లోనే నిద్రపోవటంతో వాడిని ట్రాలీలో పడుకోబెట్టి మెల్లగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాం. ఆ చర్చి గోపురాలకు అన్నీ ఇనుప రాడ్లతో ఫెన్సింగ్ లాగా వేశారు. చర్చికి రిపేర్ పనులు జరుగుతున్నాయి. మేము ఆ ఆవరణ అంతా తిరిగి ఫోటోలు తీసుకుని చర్చి లోపలికి వెళ్ళాం. వేల ఏళ్ల క్రితం ఒక మతానికి సంభందించిన తోలి ప్రార్ధనా మందిరంలో ఉండటం గొప్ప అనుభూతి. అక్కడున్న చాలా మంది టూరిస్ట్ లలో అసలు ఇండియన్స్ ఎవరూ లేరు. అక్కడున్న కొంతమంది భార్గవి తో మాట్లాడి ఫోటో తీసుకున్నారు. మేము చర్చి లోపలికి వెళ్ళేటప్పటికి హన్ష్ కూడా నిద్ర లేచాడు. అక్కడున్న దాడియస్, బార్తోలోమేవ్ తైలవర్ణ చిత్రాలు అన్నీ చూసి బయటికి వచ్చాం.
అక్కడికి కొద్ది దూరంలోనే మరో చారిత్రక కట్టడం జీవర్నాట్స్ కాథెడ్రల్ ఉంది.క్రీస్తుశకం 7 వ శతాబ్దంలో అర్మేనియా లో ఎక్కువ భాగం బైజాంటైన్ ల పరిపాలనలో ఉండేది. సమయంలోనే మధ్య ప్రాచ్యంలో ఇస్లాం మతం కూడా ప్రభావం చూపుతోంది. 643 వ సంవత్సరంలో కొంతమంది కాథలిక్కుల సూచన మేరకు Etchmiadzin కేథడ్రల్ కి పెద్దగా వ్యవహరిస్తున్న గ్రెగరీ అప్పటి రాజైన ట్రిడేట్ 3 కి ఈ నిర్మాణం గురించి ప్రతిపాదించారు.అలా 643 లో ప్రారంభమైన ఈ నిర్మాణం 652 వ సంవత్సరంలో పూర్తయ్యింది.జీవర్నాట్స్ అంటే ఆకాశ దేవతలు అని అర్ధం. అర్మేనియా ఎయిర్పోర్ట్ పేరు కూడా జీవర్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పెట్టటానికి ఈ చారిత్రక కట్టడమే ఆధారం. చుట్టూ 32 స్తంభాలతో వృత్తాకారంగా ఉన్న ఈ కట్టడం మూడు అంతస్థులతో ఉండేదని చెపుతారు. ప్రస్తుతం మొండి స్తంభాలు, గోడలు మాత్రమే మిగిలాయి.10 వ శతాబ్దం నాటికే ఈ కాథెడ్రల్ ధ్వంసం అయ్యింది. ఇందుకు గల కారణాల్ని చరిత్రకారులెవ్వరు వివరించలేదు. మళ్ళీ 1901 నుండి 1907 వరకు ఇక్కడ తవ్వకాలు జరిగి , దీన్ని మళ్ళీ పునర్నిర్మించే ప్రతిపాదన జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. ఆ తవ్వకాల్లో దొరికిన అవశేషాలు పక్కనే ఉన్న మ్యూజియంలో భద్రపరిచారు. సూర్య మానాన్ని సూచించే రాతి గడియారం మాత్రం ఈ ఆవరణలోనే బయట ఉంది. 2000 సంవత్సరంలో ఈ ప్రాంతం యునెస్కో వారసత్వ ప్రాంతంగా గుర్తింపు పొందింది. దీనికి కూడా ప్రవేశ రుసుము 2 డాలర్లు.మేము ఈ కట్టడం చూస్తుండగానే ఒక ఆర్మేనియన్ యువతి వచ్చి మీరు ఇండియన్సా అని అడిగింది. అవునని చెప్పగానే తాను ఇండియన్ కాన్సులేట్ లో 5 సంవత్సరాలు పని చేశానని తనకు ఇండియన్ వంటలు అన్నీ బాగా వచ్చని చెప్పింది. హన్ష్ ని ఎత్తుకుని ముద్దాడుతూ మాతో కలిసి ఒక ఫోటో దిగింది. మేము ఈ రెండు చూసేటప్పటికి మధ్యాహ్నం 12.30 నిమిషాలు అయ్యింది.అక్కడినుండి బయలుదేరి భోజనానికి యెరవాన్ వైపు మా కారు బయలుదేరింది.లక్ష్మణ్ గారి సూచన తో టాక్సీ డ్రైవర్ మమ్మల్ని సిటీ మధ్యలో నేల మాళిగలో ఉన్న ఒక అత్యాధునిక రెస్టారెంట్ కి తీసుకెళ్లాడు. తనని కూడా మాతోనే భోజనం చెయ్యమని కోరటంతో తానూ మాతోనే భోజనం చేశాడు. 

ప్రపంచంలో రికార్దు చేయబడిన జాతి హత్యల ఘటనల్లో అర్మేనియా జెనోసైడ్ మొదటిది.భోజనం తర్వాత నేను జెనోసైడ్ మ్యూజియం చూడాలని లక్ష్మణ్ గారికి చెప్పటంతో ఆయన ఆ విషయాన్ని డ్రైవర్ కి చెప్పారు. 16 వ శతాబ్దం నుండి 19 వ శతాబ్దం వరకు అర్మేనియా పశ్చిమ భాగం టర్కీ ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.దీనిని టర్కిష్ అర్మేనియా అని పిలిచేవారు. ఆ సమయంలోనే రుస్సో - పర్షియా యుద్ధాలు జరగటం కొంతమంది ఆర్మేనియన్లు ఆ యుద్ధాల్లో రష్యన్లకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే నెపంతో 1895 నుండి 1920 వరకు పలుదఫాలుగా టర్కీ పాలకులు అక్కడ నివసించే వారిని మట్టుబెట్టటం ప్రారంభించారు. 1915-20 కాలంలో అత్యంత ఎక్కువగా 15 లక్షలమందిని వివిధ రకాల పద్ధతుల్లో చంపటం జరిగింది. ఆఖరున సిరియా ఎడారిలో లక్షల మందిని నడిపించి దారిలోనే వారిని చంపేశారు. ఈ అతి పెద్ద మానవ హననం ఆర్మేనియన్ జెనోసైడ్ గా పేరొందింది. దీనికి సంభందించిన మ్యూజియం యెరవాన్ నగరం మధ్యలో ఉంది. ఆ ఊచకోత తరువాత 1918 నుండి అర్మేనియా రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోయింది. 1990 వరకు సోవియట్ యూనియన్ లో సభ్య దేశంగా ఉంది. 1991 నాటికి సోవియెట్ రిపబ్లిక్ విచ్చిన్నమయ్యాక స్వతంత్ర దేశంగా అవతరించింది. 1985 లో ఈ ఆర్మేనియన్ జెనోసైడ్ ని అధికారికంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి ఒక రిపోర్ట్ పంపారు. కానీ టర్కీ మరియు దాని మిత్ర దేశమైన అజర్బైజాన్ జెనోసైడ్ అనే పదం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాయి.1995 లో ఈ జెనోసైడ్ మ్యూజియం స్థాపించి, 1997 నుండి పలువురు విద్యార్థులు దీని మీద రీసెర్చ్ చేసి నివేదికలు సమర్పించగా 2017 నాటికి ప్రపంచంలో 29 దేశాలు ఆర్మేనియన్ జెనోసైడ్ ని అధికారికంగా గుర్తించాయి. ఇప్పటికీ మిగతా దేశాలన్నిటి గుర్తింపు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్మేనియన్లు పోరాడుతున్నారు. ఈ వివరాలన్నింటినీ సచిత్రంగా మ్యూజియంలో భద్రపరిచారు. భార్గవి కి ఇలాంటివి అంటే భయం, అందుకే తాను అలాంటివి చూడలేనని కార్లోనే ఉంటానని చెప్పింది. నేనొక్కడినే లోపలికి వెళ్లి అక్కడ ఉంచిన ఫోటోలు అన్నీ చూసి వచ్చాను.నేను ఇంతకుముందు పోలాండ్లో చూసిన యూదు కాన్సంట్రేషన్ కాంపుల్లో ఉన్న ఫొటోల్లాగే ఇక్కడ కూడా చంపబడిన వారి ఫోటోలు, మూకుమ్మడి హత్యల శవాలు, పుర్రెలు అన్నీ వీడియో మరియు ఫోటోల రూపంలో ఉన్నాయి. ప్రపంచంలో రికార్దు చేయబడిన జాతి హత్యల ఘటనల్లో అర్మేనియా జెనోసైడ్ మొదటిది.
అక్కడినుండి మా తదుపరి గమ్యం ఖోర్ విరాప్ అనే మరో క్రైస్తవ ఆశ్రమం. ఇది యెరవాన్ కి 40 కిలోమీటర్ల దూరంలో టర్కీ బోర్డర్ కి దగ్గరగా అరారత్ పర్వత భాగంలో ఉంది. యెరవాన్ నుండి అరారత్ వరకు 4 లేన్ల రహదారి ఉంది. ఆ రహదారిలో ఎటువంటి అడ్డంకులు లేకుండా 35 కిలోమీటర్లు ప్రయాణించాక పోకర్ వేది అనే గ్రామం దగ్గర 7 కిలోమీటర్లు లోపలికి వెళితే ఎత్తైన కొండపైన ఖోర్ విరాప్ కనిపిస్తుంది. క్రీస్తు శకం7 వ శతాబ్దంలో క్రైస్తవ మతబోధకులంతా ఇక్కడ నుండి మతబోధనలు, ప్రార్ధనలు నిర్వహించేవారు. అప్పటి రాజు త్రిడేట్ 3 కూడా ఇక్కడ ముఖ్య మతబోధకుడైన గ్రెగరీ దగ్గర బాప్టిజం తీసుకున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇది చాలా ఎత్తైన కొండమీద ఉండటంతో పైకి వెళ్ళటానికి మెట్లతో పాటు రోడ్ కూడా ఉంది. మేము హన్ష్ ని ట్రాలీ లో తీసుకుని రోడ్ మీదుగా పైకి వెళ్ళాం. అక్కడినుండి చూస్తే అరారత్ పర్వతాలు ఆకాశాన్ని తాకుతున్న అద్భుత దృశ్యం కనులవిందు చేసింది. ఈ ఖోర్ విరాప్ చుట్టూ అన్నీ పంట పొలాలు, పచ్చిక బయళ్ళు ఉన్నాయి. కొంత దూరంలో ఫెన్సింగ్ వేసి ఉన్న టర్కీ సరిహద్దు కనిపించింది. అర్మేనియా కి టర్కీ కి సత్సభందాలు లేకపోవటం వల్ల ఈ కంచే అని అర్ధం అయ్యింది. 643 వ సంవత్సరంలో ఈ చర్చి నిర్మాణం ప్రారంభించి ఒక్క చాపెల్ మాత్రమే నిర్మించారు. అందులోనే ప్రార్ధనలు జరిగేవి. తరువాత 1662 లో ఇప్పుడు ఉన్న పెద్ద చర్చి నిర్మించారు. మేము మొదటగా నిర్మించిన చాపెల్ లోకి వెళ్ళాం. అది చాలా చిన్నది, అందులోనే భూమిలోపల ఒక మాళిగ ఉంది. తరువాత బయటకి వచ్చి పక్కనున్న పెద్ద చర్చి లోకి వెళ్ళాం. మేము ఫొటోస్ తీసుకోవటానికి ఇబ్బంది పడటం చూసి అక్కడున్న ఒక ఆర్మేనియన్ మా చేతుల్లో ఉన్న హన్ష్ ని తీసుకుని మీరు తీసుకోండి అని మాకు సైగల ద్వారా చెప్పాడు. అతనికి థాంక్స్ చెప్పి అన్నీ ఫోటోలు తీసుకుని బయటికి వచ్చాం.
ఏదైనా షాపింగ్ చెయ్యాలని డ్రైవర్ కి చెప్పటంతో మళ్ళీ యెరవాన్ వచ్చాక దల్మా మాల్ అనే షాపింగ్ మాల్ కి తీసుకెళ్ళాడు. అన్నట్లు చెప్పటం మర్చిపోయా అర్మేనియా లో దొరికే వైన్ మరియు బ్రాందీ చాలా ఫేమస్ మరియు చవక. ప్రతి సూపర్ మార్కెట్లోనూ ఇవి దొరుకుతాయి. అరారత్ వైన్ అనేది ఇక్కడ మంచి బ్రాండ్. నగరం మధ్యలోనే అతి పెద్ద వైన్ ఫ్యాక్టరీ తో పాటు విస్కీ , బ్రాందీ తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ లంచ్ మరియు డిన్నర్ లలో వైన్ అనేది సర్వ సాధారణం. కావాలంటే మనం వైన్ తయారు చేసే ఫ్యాక్టరీ ని కూడా చూడచ్చు. మేము ఇదే విషయం లక్ష్మణ్ గారికి చెప్పటంతో ఆయన వెంటనే డ్రైవర్ తో మాట్లాడి మరుసటి రోజు ఉదయం ఆ ఫ్యాక్టరీ ని సందర్శించే ఏర్పాట్లు చేశారు. ఇక ఆ రోజుకి మాల్ లో కొన్ని వస్తువులు కొనుక్కుని హోటల్ కి వెళ్ళిపోయాం.
మరుసటి రోజు ఉదయం టాక్సీ డ్రైవర్ మమ్మల్ని నేరుగా బ్రాందీ ఫ్యాక్టరీ దగ్గరకి తీసుకువెళ్ళాడు. యెరవాన్ అరారత్ బ్రాందీ ఫ్యాక్టరీ అనేది అర్మేనియాలో అతి పెద్ద వైన్ తయారీ దారు. ఇది నగరం నడిమధ్యలో అతి పెద్ద ప్రహరీ గోడతో ఉంటుంది. ఇది తయారు చేసే బ్రాండ్ పేరు నోయ్. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకి ఫ్యాక్టరీ లో ఇంగ్లీష్ గైడెడ్ టూర్ ఉంటుంది. కాకపోతే ముందు రోజు అప్పాయింట్మెంట్ తీసుకోవాలి. అంతకుముందే మా డ్రైవర్ ఫ్యాక్టరీకి కాల్ చేసి ఉదయం 10 గంటలకి అప్పాయింట్మెంట్ తీసుకున్నాడు.మేము వెళ్ళేటప్పటికి అక్కడ ఒక రష్యన్ మహిళ మమ్మల్ని రిసీవ్ చేసుకుంది. మాతో పాటు ఒక పోలాండ్ మహిళ , మరియు మా గ్రూప్ లో ఇద్దరు వచ్చారు.కేవలం ఫ్యాక్టరీ చూడాలంటే 3500 డ్రాములు చెల్లించాలి. ఫ్యాక్టరీ చూడటంతో పాటు వైన్ కూడా రుచి చూడాలంటే మరో 1500 డ్రాములు అదనం. ఆ వైన్ 70 సంవత్సరాల వయసుది అట. మాములుగా బయట కొనాలంటే ఒక్క బాటిల్ ఖరీదు ౩౦౦౦ డాలర్లు. మేము మా ఇద్దరికీ 7000 డ్రాములు చెల్లించి కేవలం చూడటానికి మాత్రమే టికెట్ తీసుకున్నాము. మాతో పాటు ఉన్న పోలిష్ మహిళ మాత్రం 5000 చెల్లించి వైన్ రుచి చూసింది. మేము ఫాక్టరీ ఆవరణలోకి వెళ్ళగానే ఎదురుగా పెద్ద ఫిరంగి మరియు ఒక పాత కారు కనిపించాయి. రష్యన్ గైడ్ వాటి గురించి చెపుతూ 1877 లో నేర్సేస్ తైరాన్ అనే వ్యాపారి ఈ ఫ్యాక్టరీని స్థాపించాడు.మొదటి పది సంవత్సరాలు కేవలం వైన్ మాత్రమే తయారు చేసేవారు. 1887 నుండి బ్రాందీ తయారు చెయ్యటం మొదలు పెట్టాడు. 1899 లో నికోలావ్ అనే ఒక ఉక్రేనియన్ కి లీజుకి ఇచ్చాడు. నికోలావ్ అప్పటికే రష్యా లో అతి పెద్ద వైన్ తయారిదారు. తరువాతి కాలంలో నికోలావ్ 50000 రూబుల్స్ కి ఈ ఫ్యాక్టరీ మొత్తాన్ని కొనుకున్నాడు. 1901 లో కొన్ని వైన్ సాంపిల్స్ ని పారిస్ లో జరుగుతున్న ఒక ఎగ్జిబిషన్ కి పంపాడు. అక్కడున్న వారంతా అది రుచి చూసి తయారీ దారు గురించి ఆరా తీయగా అది అర్మేనియా నుండి వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయారట. అప్పటి నుండి నుండి నికోలావ్ యూరప్ దేశాలకి ఎగుమతి చెయ్యటం ప్రారంభించాడు. తన జీవితం మొత్తం వైన్ మరియు బ్రాందీ తయారీల మీదే గడిపాడట. రష్యా అధ్యక్షుడు స్టాలిన్ ఈ వైన్ ని రుచి చూసినవాడే. ఒకసారి ఇంగ్లాండ్ అధ్యక్షుడు విన్స్టన్ చర్చిల్ కి ఓ సమావేశంలో ఒక గ్లాస్ బ్రాందీ ఇవ్వగా రుచిలో తేడాని గమనించి ఇది ఇంతకుముందు రుచిలా లేదు అనటంతో స్టాలిన్ వెంటనే ఆరా తీయగా ఫాక్టరీ కి సంభందించిన ముఖ్య సాంకేతిక నిపుణుడు ఖైదు చేయబడ్డాడని, అందువల్లనే వేరే వాళ్ళు ఆ మిశ్రమాన్ని కలపటం వల్ల రుచిలో మార్పు వచ్చిందని తెలుసుకున్నాడు. వెంటనే అతన్ని విడుదల చేయమని చెప్పి మళ్ళి ఫ్యాక్టరీలో ఉద్యోగిగా నియమించాడట. కొన్ని సంవత్సరాలకి రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఈ ఫాక్టరీ అనేక కారణాలతో మూతబడింది.దాదాపు 50 సంవత్సరాల పాటు ఇది తెరుచుకోలేదు. మళ్ళీ 2002 లో 50 మిలియన్ డాలర్ల పెట్టుబడితో మల్టీ గ్రూప్ ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరించింది. ఆ పునరుద్ధరణలో ఫ్యాక్టరీని కోసం తవ్వుతుండగా దొరికినదే ఈ ఫిరంగి అని చెప్పింది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో పడిన కొన్ని బాంబులు , ఆయుధాలు కూడా ఇక్కడ దొరికాయట. అక్కడున్న కార్ కూడా ఫ్యాక్టరీ మూతబడినప్పుడు వదిలేసినదే. లోపలికి వెళ్ళగానే ఈ ఫ్యాక్టరీ వ్యవస్థాపకులు వాడిన వస్తువులు, కుర్చీలు , అన్నీ ఒక గదిలో ప్రదర్శనకి ఉంచారు. అప్పట్లో వాళ్ళు వాడిన టెలిఫోన్ , మంచం ఇంకా చాలా వస్తువులు అక్కడ ఉన్నాయి. అక్కడినుండి వైన్ నిల్వ ఉంచే స్టోర్ కి తీసుకు వెళ్ళింది. పాత సినిమాల్లో చూపించినట్లు అన్నీ చెక్క పీపాలలో వైన్ నిల్వ చేసి ఉంది. అది చాలా పెద్ద స్టోర్. అక్కడినుండే నేరుగా పైప్ లో బాట్లింగ్ కి వెళుతుంది. ఈ ఫ్యాక్టరీ బయటే ఒక స్టోర్ ఉంది. బయట కంటే ఇక్కడ కొంచెం తక్కువ ధరలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ 50 ఇయర్స్ వైన్ కూడా తయారవుతోంది.నోయ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన బ్రాందీ బ్రాండ్.
ఇదే రోజున మా తిరుగు ప్రయాణం. సాయంత్రం 4గంటలకి ఫ్లైట్ కావటంతో మేము 2 గంటకల్లా ఎయిర్పోర్ట్ కి చేరుకోవాలి. అప్పటికే భోజన సమయం కావటంతో దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేసి ఎయిర్పోర్ట్ కి పయనమయ్యాం. మాకంటే ముందుగా రెండేళ్ళ క్రితం మా గ్రామానికి చెందిన Gorrepati Narasimha Prasad గారుఈ దేశాన్ని సందర్శించటం వల్ల ఆయన ఇచ్చిన సలహాలు కూడా మా పర్యటనకి ఎంతో దోహదం చేశాయి. డాక్టర్ లక్ష్మణ్ కుమార్ గారి పరిచయం కూడా ఆయన వల్ల జరిగినదే.
అర్మేనియా లో నివాస ఖర్చు చాలా తక్కువ. ఒక కుటుంబానికి నెలకి అయ్యే ఖర్చు కేవలం 300 డాలర్లు.టూరిజం మీద ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా ఎక్కడా కూడా వ్యాపార ధోరణి కనపడదు. హోటల్స్, భోజనం మరియు నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా మన దేశంలో కంటే చాలా తక్కువ.
ప్రపంచంలో ఎక్కువకాలం నుండి మనుషులు నివసిస్తున్న నగరాల్లో యెరవాన్ ఒకటి. ఇంతటి పురాతన నగరాన్ని , దేశాన్ని సందర్శించటం మాత్రం మరువలేని అనుభూతి. ఆ నాలుగు రోజుల అనుభవాలని ఆనందాన్ని మూటగట్టుకుని మళ్ళీ దుబాయ్ ఉరుకుల పరుగుల జీవితంలోకి వచ్చేశాం.

Friday, February 19, 2016

మన ఊరి శ్రీమంతుడు

టైటిల్ వినగానే ఇదేదో గ్రామంలో ఆస్తి పరుల గురించిన కధనం అనుకోకండి. మొన్నే రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా శ్రీమంతుడు చూశాను. గ్రామం నుండి సిటీకి వెళ్ళిపోయి అక్కడ బాగా సంపాదించిన తర్వాత మళ్ళీ సొంత ఊరుని దత్తత తీసుకుని అభివృద్ది చెయ్యటం అనే ఉద్దేశ్యంతో రూపొందిన ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు అందులో హీరోగా మహేష్ బాబు కనపడలేదు. యాదృచ్చికం గానే సినిమాలో మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామం పేరు దేవరకోట. కృష్ణా జిల్లాలో వెనుకబడిన ఊరు అంటే సమర్ధనీయంగా ఉండదేమో అని కాబోలు సినిమాలో ఇది ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నట్లు చూపించారు. సినిమాలో మహేష్ బాబు ఊరుకి రావటం దగ్గరనుండి అనుక్షణం నా కళ్ళముందు కనిపించిన వ్యక్తి శ్రీ గొర్రెపాటి రంగనాధ బాబు గారు. శిధిలావస్థలో ఉన్న స్కూల్ బిల్డింగ్ ని పునర్నిర్మించటంతో మొదలైన సేవా కార్యక్రమం చూడగానే మన హైస్కూల్లో రంగనాధబాబు బాబు గారు పదేళ్ళ క్రితమే కట్టించిన హైస్కూల్ బిల్డింగ్ గుర్తొచ్చింది. నీళ్ళు లేక ఎండిపోతున్న పొలాలని కాపాడటానికి చెరువు నీళ్ళని మళ్ళించి రైతులని కాపాడాలని ప్రయత్నించిన హీరోని చూసినపుడు , 8 ఏళ్ల క్రితమే గుండేరు మీద బెడ్ రెగ్యులేటర్ నిర్మించి చివరి ఎకరం వరకు నీరందించిన రంగనాధబాబు గారి భగీరధ ప్రయత్నం గుర్తొచ్చింది. మహేష్ బాబు కబడ్డీ ఆడుతున్నపుడు , ప్రతి సంక్రాంతికి మన గ్రామంలో గొర్రెపాటి విద్యా ట్రస్ట్ నిర్వహించే కబడ్డీ పోటీలు , ముగ్గుల పోటీలు , ఎడ్లపందాలు గుర్తొచ్చాయి. ఊరికి రోడ్డు వేస్తున్నపుడు , గ్రామంలో ఎన్ ఆర్ ఐ ల సాయంతో వేస్తున్న సిమెంట్ రోడ్లు కళ్ళ ముందు కదిలాయి. 
రాజేంద్రప్రసాద్ కారక్టర్ ని చూసినపుడు మన ఊరులో ఉన్న చాలామంది పెద్దలు గుర్తొచ్చారు. రంగనాధబాబు గారి సంకల్పానికి వెన్నుదన్నుగా నిలబడి ఆయన చేపట్టిన సేవాకార్యక్రమాలని నిస్వార్ధంగా నిర్వహిస్తున్న రాజేంద్రప్రసాద్ లాంటి మనుషులు మన గ్రామంలోనూ చాలామంది ఉన్నారు. ఇలా ఒకటేమిటి ప్రతి సన్నివేశంలోనూ నాకు మన గ్రామం , మన శ్రీమంతుడు రంగనాధబాబు గారే గుర్తొచ్చారు. రంగనాధ బాబు గారితో పాటు మన గ్రామం నుండి విదేశాల్లో , వ్యాపారాల్లో స్థిరపడ్డ చాలామంది వదాన్యులు తమ తమ వదాన్యతని పలు సందర్భాల్లో చాటుకుంటూనే ఉన్నారు. జలదీశ్వరాలయ పునర్నిర్మాణంలో , రుద్రభూమి నిర్మాణంలో , స్కూల్ అభివృద్ధి లో , మన ఊరికి చాలామంది శ్రీమంతులే ఉన్నారు. తప్పకుండా వారందరి సేవలని తలుచుకోవటం మన భాద్యత.
అయితే ఈ కాన్సెప్ట్ కి 28 సంవత్సరాలకి ముందే ఆద్యులుగా  శ్రీ రంగనాధబాబు గారినే చెప్పుకోవాలి. ప్రతిభ ఉండి చదువుకోవటానికి తగిన ఆర్ధికస్తోమత లేని విధ్యార్ధులను ప్రోత్సహించాలని 1987 లో  శ్రీ గొర్రెపాటి వెంకట్రాయులు ఉదయభాస్కరమ్మ విద్యాట్రస్టు ని నెలకొల్పి ,అప్పట్లో లక్ష రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి వాటి పై వచ్చే వడ్డీ తో హైస్కూలు విధ్యార్ధులకు బహుమతులు మరియు మెరిట్ స్కాలర్ షిప్ లు ఇవ్వటం మొదలు పెట్టారు. నేను వ్యక్తిగతంగా ఆయన్ని కలిసినపుడు, విద్య లేకపోవటం వల్లే వెనకబాటు తనం వస్తుందని బలంగా నమ్మటం వల్ల, ఆ విద్యని అందరికీ అందించాలనేదే తన సంకల్పం అని చెప్పారు. ఎక్కువ ప్రభుత్వ పాఠశాలల మీద దృష్టి పెట్టటానికి కారణం, వెనకబడిన వర్గాలు చదువుకోగలిగింది ప్రభుత్వ పాఠశాలలోనే.అందుకే మన గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా శిధిలమవుతున్న ప్రభుత్వ పాఠశాలల భవనాల పునర్నిర్మాణాన్ని చేపట్టారు.
కాలం గడుస్తున్న కొద్దీ ఆయన సేవా కార్యక్రమాల విస్తృతి పెరిగింది. కేవలం విద్యా సంభంధమైన విషయాలే కాకుండా గ్రామీణ పరిశుభ్రత మెరుగు పరచాలనే సంకల్పం తో స్వచ్చంధంగా మరుగు దొడ్లు నిర్మించుకునే వెనకబడిన తరగతుల వారికి ఆర్ధికసాయం అందించారు. శివారు గ్రామాల్లో కమ్యూనిటి హాల్స్ నిర్మాణం, పాఠశాలల తరగతి గదుల నిర్మాణం చేపట్టి ఆయా గ్రామాల అభ్యున్నతి కి కృషి చేస్తున్నారు. అంతే కాకుండా ఉచిత మెడికల్ క్యాంప్ లు,అర్హులైన వారికి వైద్యసాయం,వృద్ధాప్య పింఛన్లు అందిస్తున్నారు. ఈ 28 ఏళ్లలో దాదాపు 3 కోట్ల రూపాయలకి పైగా గ్రామాభివృద్ధికి వెచ్చించారు. ఊరు మొదట్లో కనిపించే హైస్కూలు నుండి ఊరు చివర నిర్మించిన బెడ్ రేగ్యులటర్ వరకు ఆయన గ్రామాన్ని దత్తత తీసుకున్న ఛాయలు మనకి అడుగడుగునా మన కళ్ళకి సజీవ సాక్ష్యాలుగా కన్పిస్తాయి. బడి , గుడి , రోడ్లు , వ్యవసాయం , నీరు , ఇలా ఒకటేమిటి గ్రామంలో ప్రతి చోట గొర్రెపాటి విద్యా ట్రస్ట్ ముద్ర కనిపిస్తుంది. రంగనాధబాబు గారి స్ఫూర్తితోనే మిగతా వారంతా తమ వంతు బాధ్యతగా నిర్మించిన రుద్రభూమి , కళ్యాణ మండపం , జలధీశ్వరాలయ పునర్నిర్మాణం , సిమెంట్ రోడ్లు, మన గ్రామంలోని శ్రీమంతుల దత్తతకి , జన్మభూమి మీద వారికున్న భాధ్యతకి నిదర్శనాలు. వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ , మన శ్రీమంతుడు శ్రీ గొర్రెపాటి రంగనాధ బాబు గారికి, ఆయనకీ అండగా నిలిచిన వారి సోదరులు , శ్రీ పట్టవర్ధన్  , శ్రీ నవనీత కృష్ణ , శ్రీ సురేంద్ర గార్లకు మరియు వారి కుటుంబాలకి నా హృదయ పూర్వక కృతఙ్ఞతలు. 

Monday, December 14, 2015

నా ఐరోపా యాత్ర - 30 (ముగింపు)

నిన్న రాత్రి వచ్చిన పీడకల తలుచుకుంటూ ఈ రోజు పడుకోకుండా ఉండలేము. ఎంత మంచి కల వచ్చినా అందులోనే ఉండిపోయి నిద్ర లేవకుండా ఉండలేము. మనిషి గమనమైనా అంతేఎక్కడా దేనికోసం మనం ఆగలేము. మనకోసం ఏదీ ఆగదు. వుయ్ జస్ట్ మూవ్ ఆన్ అంతే. దాదాపు 14నెలల  యూరోప్ వాసాన్ని అనుభవాలని మూటగట్టుకుని మరో మజిలీ కోసం బయలుదేరాల్సి వచ్చింది. వచ్చే ముందు రోజు అక్కడున్న ఇండియన్స్ అంతా మాకు వీడ్కోలు పలకటానికి మా ఇంటికి వచ్చారు. మేము గడిపిన ఆ రోజులన్నీ నెమరు వేసుకుని ఉల్లాసంగా గడిపాం. ఎక్కడికైనా టూర్ ప్లాన్ చెయ్యాలంటే నేనే ముందు ఉండేవాడిని. భార్గవి అక్కడ 3 నెలలే ఉన్నా అందరికీ చాలా దగ్గర అయ్యింది. ఇప్పటికీ మాకు వారితో ఆ సాన్నిహిత్యం కొనసాగుతోంది.
మాకు బాగా దగ్గర అయిన శశి అయితే మేము వచ్చే రోజు చాలా ఎమోషనల్ అయ్యాడు. మార్చిన్ దంపతులు మింజు జేర్జ్ నుండి 400 కిలోమీటర్లు మమ్మల్ని ఎయిర్పోర్ట్ వరకు సాగనంపటానికి వచ్చారు. మేము బోర్డింగ్ లోకి వెళ్తుంటే మార్చిన్ కాషా పరుగున వచ్చి మమ్మల్ని వాటేసుకుని ఏడ్చేసారు. జీవితకాలానికి సరిపడిన సంతోషాన్ని అనుభవాలని ఇచ్చిన పోలాండ్ కి వీడ్కోలు పలుకుతూ మే 20, 2013 న పోలాండ్ రాజధాని వార్సా నుండి మధ్యాహ్నం 2.45 నిమిషాలకి దుబాయ్ వెళ్ళే విమానం ఎక్కాం. అప్పటినుండి ఈరోజు వరకు దుబాయ్ లోనే నివాసం. ఇక్కడికొచ్చాక ఉద్యోగ భాధ్యతలు పెరగటంతో నేను యూరప్ నుండి వచ్చేసిన సంవత్సరాలకి కాని ఈ రచనని పూర్తీ చెయ్యలేకపోయాను. నేను అసలు రచయితనే కాదు. నాకు సంప్రదాయక తెలుగు సాహిత్యం అంటేనే తెలియదు. కేవలం చిన్నపటినుండి చదివిన పాఠకానుభవంతోఒక పాఠకుడిగానే ఈ నా అనుభవాలు రాశాను. చాలా చోట్ల నాకు తెలియకుండానే నేను చదివిన రచనల ప్రభావం కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఆ ప్రభావాన్ని నియంత్రించలేకపోయాను అనటం కంటే అంతకుమించి నేను రాయలేకపోయాను అనటం కరేక్టేమో. చరిత్ర గురించిన జిజ్ఞాసకొత్త ప్రదేశాలు చూడాలన్న ఉత్సాహంనాకు తెలిసింది పదిమందికి చెప్పాలన్న ఆకాంక్షే నన్ను నడిపించింది. ఒక పక్క వృత్తికి న్యాయం చేస్తూనే ఖాళీ సమయాల్లో ఈ రచనని కొనసాగించాను. 
                   ​నేను సందర్శించిన దేశాల గొప్పతనాన్ని అద్భుతాలని క్రమశిక్షణ ని అక్కడి వ్యవస్థలని వివరించేటప్పుడు" అదే మన దేశంలో అయితేనా" అంటూ పోల్చి మన దేశాన్ని తక్కువ చేసే ప్రయత్నం ఎక్కడా చెయ్యలేదు. నేను అక్కడి వ్యవస్థలని చూసి గొప్పగా చెప్పినట్లే ఇతర దేశాల వాళ్ళు భారతదేశం గురించి అంత కన్నా గొప్పగా రచనలు చేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం అనిపించుకునే ప్రతి దేశంలో ఉన్న వ్యవస్థలు సౌకర్యాలు ,అద్భుతాలు మనకీ ఉన్నాయి. కాకపొతే అవి చివరి వ్యక్తి వరకు చేరటంలోనే వైఫల్యం చెందుతున్నాం. ఇన్ని దేశాలు చూసిన తర్వాత నాకనిపించింది ఏమిటంటే మన దేశంలో కేవలం రెండు వ్యవస్థలు సక్రమంగా పని చేస్తే ప్రపంచంలో మరే దేశం మనతో పోటీ పడలేదు. ఒకటి ట్రాఫిక్ రెండు పరిశుభ్రత. ఈ రెండూ కూడా ప్రభుత్వం ప్రజలు కలిసి పూనుకోవాల్సిన విషయాలుస్వచ్ఛ భారత్ పిలుపుతో ఇప్పటికే ఒక వ్యవస్థ ప్రక్షాళన ప్రారంభమైంది. ఇది కనుక ఇలాగే కొనసాగితే త్వరలోనే స్వచ్చ భారతాన్ని చూడగలం. ట్రాఫిక్ పట్ల డ్రైవింగ్ లైసెన్సుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే క్రమశిక్షణతో వెళ్ళే ట్రాఫిక్ వల్ల 50కోట్ల ప్రజల విలువైన సమయం ట్రాఫిక్ జామ్ ల వల్ల రోడ్ల మీద వృధా కాకుండా ఉంటుంది. లక్షలాది ప్రాణాలు రోడ్ల ఆకలికి ఆహుతి కాకుండా ఉంటాయి. అలాగే ప్రజలు కూడా ఈ విషయంలో అవగాహన పెంచుకుంటే మన అభివృద్ధి వేగానికి ఇక ఆకాశమే హద్దు. 
                     నేను మొదటిసారి దేశం దాటి దుబాయ్ వచ్చినప్పుడు అక్కడి రాచరిక వ్యవస్థ వల్ల జరిగిన అభివృద్ధి చూశాక ఇండియాలో ప్రజాస్వామ్యం వల్లే అభివృద్ధి జరగటం లేదనే అభిప్రాయం ఉండేది. తర్వాత కొన్నాళ్ళకి కొన్ని దేశాల నియంతలని చూశాక ఆ అభిప్రాయం తప్పని అనుకున్నాను. మరికొన్నాళ్లకి అత్యధిక జనాభావైశాల్యం వల్ల మన దేశం త్వరగా అభివృద్ధి చెందటం లేదనే అభిప్రాయానికి వచ్చాను. చైనా సాధించిన ప్రగతి చూశాక ఆ అభిప్రాయం కూడా తప్పని అనుకున్నాను. నేను చూసిన దేశాల అభివృద్దిలో ప్రభుత్వ భాగస్వామ్యం కంటే ప్రజల భాగస్వామ్యమే ఎక్కువ. ప్రభుత్వం అంటే వాళ్లకి భయం కాదుతమ దేశం అంటే భాధ్యత. అర్ధరాత్రి గంటలకి నిర్మానుష్యంగా ఉన్న ఒక చిన్న రోడ్డులో రెడ్ సిగ్నల్ పడినప్పుడుమిగతా మూడు దిక్కులనుండి వాహనాలు రావు అని తెలిసినా ఒక పోలిష్ జాతీయుడు 90 సెకండ్ల పాటు ఆ సిగ్నల్ దగ్గరే నిరీక్షించటం నేను పక్కనుండి చూశాను. అదే మనం అయితే ఒక్క సెకండ్ కూడా ఉండకుండా సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోతాం. రోడ్డు మీద చాక్లెట్ తిని ఆ కాగితం పారేయటానికి డస్ట్ బిన్ కోసం ఫర్లాంగు దూరం నడిచివెళ్ళిన వ్యక్తుల్ని చూసాను. విచిత్రం ఏంటంటే ఇలాంటి క్రమశిక్షణ మన దేశం నుండి ఆయా దేశాలలో స్థిరపడిన ప్రతి భారతీయుడుకి ఉంటుంది. అది ఆ ప్రభుత్వం అంటే భయం కాదుపక్కవాడు చులకనగా చూస్తారేమో అని భయం. మన దేశంలో లోపించింది అదే. ప్రభుత్వాలు చట్టాలు చెయ్యగలవు తప్ప వాటిని ప్రతివారు పాటిస్తున్నారా అని సమీక్షించలేవు. చట్టాలని గౌరవించటం వాటిని పాటించటం ప్రజల భాధ్యత.  
            ప్రభుత్వ పనితీరు మారాలని ప్రజలువ్యవస్థ మారాలని మేధావులుమనలో మార్పు రావాలని సామాజిక ఉద్యమ కారులుఒకరినొకరు విమర్శించుకుంటూ కాలం గడిపే కంటే ముందు మనం చెయ్యగలిగింది చేస్తే మిగతావన్నీ కలిసి వస్తాయి.
నా ఈ రచనలో ఎక్కడైనా తప్పులు కనిపించినాఅపరిపక్వమైన భావాలు అనిపించినా ఆ తప్పు నా వయసుదే కాని నాది కాదు. ఏమో ఇంకో పదేళ్ళు గడిచాక నేను రాసిన ఈ  పుస్తకం చదువుతుంటే నాక్కూడా అలాగే అనిపించవచ్చు.నా ఈ పుస్తకం కొంతమందికైనా విజ్ఞానాన్ని అందిస్తే అదే పదివేలు.నా తోలి ముద్రిత రచనని సహృదయం తో ఆదరిస్తారని ఆశిస్తూ... 

Tuesday, November 24, 2015

నా ఐరోపా యాత్ర - 29 ( చెక్ రిపబ్లిక్ )

హైదరాబాద్ లో ఎర్రగడ్డ గోకుల్ ధియేటర్ ఎదురుగా రోడ్డులోకి వెళితే జెక్ కాలనీ అనే ఒక ప్రాంతం కనిపిస్తుంది. అసలు జెక్ కాలనీ వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా సిటీలో కలిసిపోయింది కాని ఒకప్పుడు ఇది సిటీ శివారు ప్రాంతం. అశోక్ లేలాండ్ , ఆల్విన్ , ఆస్బెస్టాస్ లాంటి ఎన్నో పెద్ద పరిశ్రమలు ఇక్కడ ఉండేవి. దానికంటే ముందు నిజాం కాలంలో ఒక మందుగుండు ఫాక్టరీ ఇక్కడ ఉండేది. ఆ ఫాక్టరీ నిర్మాణ నిమిత్తం జెకోస్లోవేకియా దేశం నుండి ఇంజినీర్లని ఇక్కడికి పిలిపించారు. పిస్తోళ్ల తయారీకి చెకోస్లోవేకియా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తయారయ్యే తుపాకులు ప్రపంచం నలుమూలలకీ ఎగుమతి అవుతాయి. బహుశా అందుకే నిజాం నవాబు వారిని ఇక్కడికి పిలిపించి ఉండవచ్చు. ఆ ఫాక్టరీ నడిచినంత కాలం ఆ దేశం నుండి వచ్చిన ఇంజినీర్ల కోసం 50 బంగ్లాలు నిర్మించి ఒక కాలనీగా ఏర్పాటు చేసారు. విశాలమైన రోడ్లు , పార్కులతో కాలనీ ని అందంగా తీర్చిదిద్దారు. కాల క్రమేణా ఆ ఫాక్టరీ మూతబడటంతో ఆ దేశస్థులంతా తిరిగి తమ దేశానికి వెళ్ళిపోయారు. చాలా కాలం వరకు ఆ బంగ్లాలు అలాగే ఉన్నాయి. కాలక్రమేణా అవన్నీ కూల్చేసి ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టారు.ఆ జెక్ కాలనీ పేరు మాత్రం అలాగే ఉండిపోయింది. ఇదీ మనకి జెక్ రిపబ్లిక్ కి ఉన్న అనుభంధం.

 మే 6 వ తేదీన మా పర్యటన ముగించుకు వచ్చాక మళ్ళీ మే 11 వ తేదీన వీకెండ్ కావటంతో చెక్ రిపబ్లిక్ వెళదామని నిర్ణయించుకున్నాం. మార్చిన్ , కాషా కూడా ఆ దేశాన్ని చూడలేదు. ఒకప్పుడు ఈ దేశం పేరు చెకోస్లోవేకియా.1918 లో ఆస్ట్రియన్ హంగరీ సామ్రాజ్యం నుండి స్వతంత్రం పొంది చెకోస్లోవేకియా గా అవతరించింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నాజీల చేతుల్లో ఉంది. యుద్ధానంతరం సోవియట్ యూనియన్ తో కలిసి కొనసాగింది 1989 లో సోవియట్ యూనియన్ పతనం తరువాత స్వతంతరంగా అవతరించి 1993 లో శాంతియుతంగా రెండు దేశాలుగా విడిపోయింది. భూబాగంతో పాటు పేరుని కూడా సమానంగా పంచుకుని చెకోస్లోవేకియా నుండి చెక్ రిపబ్లిక్ , స్లోవేకియా అనే రెండు దేశాలుగా ఏర్పడ్డాయి. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్. మేము ఇప్పుడు వెళ్ళబోతోంది అక్కడికే. మేమున్న మింజు జేర్జ్ నుండి ప్రాగ్ 360 కిలోమీటర్లు. రోడ్డు ద్వారా వెళితే 4 గంటల ప్రయాణం. ఒక్కరోజులోనే వెళ్లి వద్దామని అనుకున్నాం. చెక్ కరెన్సీ పేరు క్రోనా. మన డబ్బుల్లో ఒక క్రోనా కి 2.50 రూపాయలు వస్తాయి. అదే ఒక యూరో కి 27 క్రోనాలు వస్తాయి.ఆరోజు ఉదయం త్వరగా బయలుదేరినా సగం దూరం వెళ్ళేటప్పటికి వర్షం మొదలైంది. వేరే ఇతర దేశాల వాహనాలు చెక్ రిపబ్లిక్ లోకి వెళ్ళాలంటే పర్మిట్ తీసుకోవాలి. దారిలో ఉండే అన్ని పెట్రోల్ బంక్స్ లో ఇవి ఉంటాయి.

మేము వెళుతున్న దారిలోనే స్కోడా కార్ల ఫాక్టరీ కనిపించింది. మనం వాడే స్కోడా కార్లకి పుట్టినిల్లు ఈ దేశమే. దారిలో ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ మధ్యలో ఆగి అక్కడి పొలాలు , ఇళ్ళ మధ్య ఫొటోస్ తీసుకుంటూ వెళుతున్నాం. మధ్యలో ఒక చోట చిన్న రైల్వే క్రాసింగ్ వచ్చింది. అది ఆ దేశపు లోకల్ ట్రైన్ అనుకుంటా , మన ఊటీ లో తిరిగే చిన్న ట్రైన్ లా ఉంది. దాదాపు 4 గంటల 30 నిమిషాలు ప్రయాణించాక ప్రాగ్ చేరుకున్నాం. 1100 ఏళ్ల ఈ పురాతన పట్టణాన్ని స్థానికులు ప్రాహా అంటారు. జనాభా పదమూడు లక్షలు. ఇది చెక్ దేశంలోని అతిపెద్ద నగరం. మొదటి ప్రపంచ యుద్ధానంతరం చెకోస్లోవేకియాకి రాజధాని అయింది. స్లోవక్, చెక్ అధికారిక భాషలు. స్లోవక్ చెక్‌భాషలోని ఓ మాండలీకం. నలభై శాతం మంది దాన్నే మాట్లాడతారు.అసలు ఇక్కడ నిరుద్యోగమే లేదట. ముందు మా కార్ ని ఒక చోట భూగర్భంలో పార్క్ చేసేసాం.పార్కింగ్ ఖరీదు 180 క్రోనాలు.అక్కడికి దూరంగా ప్రాగ్ కేజిల్ కనిపిస్తోంది. దీని పేరు హ్రాడ్‌కని. పద్దెనిమిది ఎకరాల్లో విస్తరించుకున్న వెయ్యి సంవత్సరాల ఈ కోట యునెస్కో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది.

ప్రాగ్ మధ్యలో వ్లటావ నది ప్రవహిస్తుంది.ఆ నదికి రెండు వైపులా నగరం ఉంది. మేము ఆ ప్రాగ్ కాజిల్ కి ఇవతలి ఒడ్డున ఉన్నాం. దానిని చేరుకోవాలంటే వ్లటావ నదిని దాటాలి.చెక్ రిపబ్లిక్‌లో ఉత్తరం వైపు నుంచి ప్రవహించే అతి పొడవైన నది వ్లటావా. ఇది నాలుగు వందల ముప్ఫై కిలోమీటర్లు ప్రయాణించాక, మెల్‌నిక్ అనేచోట ఎల్బీ నదిలో కలుస్తుంది. వ్లటావా నది మీద 31 వంతెనలున్నాయి. వాటిలో అతి పురాతనమైనది చార్లెస్ బ్రిడ్జి. మేము ఛార్లెస్ బ్రిడ్జి మీదుగానే వ్లటావా ని దాటి అవతలకి వెళ్ళాలి. బొహీమియన్ శాండ్‌స్టోన్‌తో పూర్తయిన దీన్ని మొదట్లో స్టోన్‌బ్రిడ్జి లేదా ప్రాగ్ బ్రిడ్జి అనేవారు. పాతరోజుల్లో గుడ్డు సొనని సున్నంలో కలిపి దీన్ని నిర్మించారు. 1870 నించి మాత్రమే దీన్ని చార్లెస్ బ్రిడ్జిగా వ్యవహరిస్తున్నారు. బ్రిడ్జి ఫెన్సింగ్ రాడ్లకి వేసిన వందలకొద్దీ తాళాలు చూసి నవ్వుకున్నాం. పారిస్ లో సీన్ నది ఒడ్డున కూడా ఇలాంటి తాళాలు చూసాం. వీటిని ‘లాక్స్ ఆఫ్ లవ్’ అంటారు. ప్రేమికులు ఇక్కడ తాళాలు వేస్తే వారి ప్రేమ సఫలీకృతం అవుతుందనే ఇక్కడివాళ్ళు నమ్ముతారు.1621 లో నరికిన మనుషుల తలలని ఈ బ్రిడ్జి మీద ఉంచి, చెక్ తిరుగుబాటుదారులు ప్రాగ్ కేజిల్‌కి రాకుండా ఆనాటి రాజు భయభ్రాంతులకి గురిచేశాడు. 1648లో స్వీడిష్ సైన్యం దాడి చేసినప్పుడు, ఈ బ్రిడ్జి మీద యుద్ధం చేయగా కొంత దెబ్బతింది. పూర్వం సైనికులు దీనిమీద నించి శత్రుసైన్యం వస్తోందేమోనని కాపలా కాసేవారు. ఎందుకంటే కోటలోకి ఈ బ్రిడ్జి మీద నించే వెళ్లాలి.ఇప్పుడు మేము కూడా ఈ బ్రిడ్జి మీదుగానే కోట లోకి వెళుతున్నాం.

ప్రాగ్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు మాత్రం బావున్నాయి. ట్రాము , బస్సులతోపాటు వ్లటావ నదిలో బోట్లు కూడా ఉన్నాయి. బ్రిడ్జి దాటి అవతలకి చేరుకున్నాక కొంత ఎత్తైన ప్రాంతంలోకి వెళ్లి ఎదురుగా ఉన్న ఓ గేటులోంచి లోపలకు నడిచాం. ఆ గేటుకి అటూ ఇటూ నీలం యూనిఫామ్‌లో ఇద్దరు గార్డులు అటెన్షన్‌లో నిలబడి ఉన్నారు. గంటకోసారి ఇక్కడ జరిగే చేంజ్ ఆఫ్ గార్డ్స్ సెరమనీని పర్యాటకులు ఉత్సాహంగా గమనిస్తారు. ఆ గేట్ దాటి లోపలకి వెళ్తే ఎదురుగా పెద్ద కోర్ట్ యార్డ్. మధ్యలో ఓచోట ఆనాటి బావి. దాన్ని ఐరన్ మెష్‌తో మూసేశారు. దాని ఎదురుగా స్త్రీల ప్రాచీన మోనాస్ట్రీ, కుడివైపు 12వ శతాబ్దంలో నిర్మించిన రోమనెస్క్యూ ప్యాలెస్, ఎడమవైపు సెయింట్ వైటస్ కెథడ్రిల్ ఉన్నాయి. చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఇక్కడే నివసిస్తున్నాడు. ప్రాగ్ లో అధ్యక్షుడు లేకపోతే ఆ భవనం పై జెండా ఉండదట.

అలాగే నడుచుకుంటూ వెనుక భాగాన ఉన్న సెయింట్ వైటస్ కెథడ్రిల్లోకి నడిచాం. అసలు ఎంత పెద్ద నిర్మాణం అది. మాకు తల ఎత్తి చూస్తే అసలు ఏమీ కనపడట్లా.దీని నిర్మాణం పూర్తవడానికి ఆరు వందల యేళ్లు పట్టిందట. 1344 లో చార్లెస్ IV దీని నిర్మాణాన్ని చేపట్టాడు. పదో శతాబ్దానికి చెందిన రొటుండా అనే భవంతిని పడగొట్టి, ఆ స్థలంలో ఈ కెథడ్రిల్ కట్టారు.  ఇది చెకోస్లోవేకియాలోని అతిపెద్ద చర్చి. దీన్ని గోథే ఆర్కిటెక్చర్‌తో నిర్మించారు. చెక్ రాజుల పట్టాభిషేకాలన్నీ ఇక్కడే జరిగాయి. సెయింట్ వెన్‌సెస్‌లాస్ మృతదేహాన్ని ఖననం చేశారు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. చెక్‌ని పాలించిన చార్లెస్ IV, ఆయన నలుగురు భార్యలు ఇక్కడే సమాధి చేయబడ్డారు. నవంబర్ 1344లో దీన్ని తెరిచారు. ఇది రాజుల పట్టాభిషేకానికి, సమాధులకి, రాజవంశీయుల ఆభరణాలని దాచడానికి ప్రధానంగా ఉద్దేశించబడింది.బొహీమియన్ రాజులు పట్టాభిషేక సమయంలో ఉపయోగించిన బంగారు ఆభరణాలు భద్రపరిచిన క్రౌన్ చాంబర్‌ ఇందులోనే ఉంది . ఆ గది తలుపులు తెరవడానికి ఎనిమిది తాళం చెవులు అవసరం అవుతాయి. చెక్ అధ్యక్షుడు, ప్రైమ్ మినిస్టర్ మొదలైన ఎనిమిదిమంది దగ్గర ఈ తాళం చెవులు ఉంటాయి. వారంతా వస్తే కాని ఆ తలుపు తెరిచేందుకు వీలుపడదు.

కోట వెనక భాగంలోంచి కిందకి దిగి ఓ చిన్న సందులోకి వెళ్లాం. దాన్ని గోల్డెన్ లేన్ అంటారు. 15వ శతాబ్దానికి చెందిన ఈ లేన్‌ని చూడటానికి పర్యాటకులు వస్తూండటంతో దాని యజమానులు తమ ఇళ్లు అపూర్వమైనవని గ్రహించి, వాటిని ఫర్నిచర్‌తో, రంగులతో అలంకరించి, కొన్ని నాణాలని తీసుకుని పర్యాటకులకు తమ ఇళ్లని చూపించసాగారు.1953లో చెకోస్లోవేకియా అధ్యక్షుడి కార్యాలయం, గోల్డెన్ లేన్‌లోని ఇళ్లన్నిటినీ కొనేసింది.
కొంతదూరం వెళ్లాక ఓ ఇరుకైన సందు ఉంది , అది ప్రపంచంలోని అతి చిన్న పాదచారుల సందు. ఒకళ్లు వెళ్తే ఇంకొకరు రాలేనంత చిన్న సందు కాబట్టి అక్కడ ట్రాఫిక్ లైట్లని అమర్చారు. గ్రీన్ లైట్ వెలిగినప్పుడు మాత్రమే వెళ్లాలి. లేదంటే మనిషి ఎదురొస్తాడు.మేము వెళ్ళగానే రెడ్ లైట్ ఉండటంతో కాసేపు ఆగాము. అక్కడి నుండి మళ్ళీ చార్లెస్ బ్రిడ్జి మీదుగా  నడుస్తూ టౌన్‌హాల్ స్క్వేర్‌కి చేరుకున్నాం. టౌన్‌హాల్ టవర్‌కి దక్షిణ గోడ దగ్గర 1410లో అమర్చిన ఓర్లోజ్ (ఆస్ట్రొనామికల్ గడియారం) ఉంది. ప్రపంచంలో ఉన్న అలాంటి మూడు గడియారాల్లో ప్రస్తుతం పనిచేసేది ఇదొక్కటే. టవర్ పైన ఉన్న ఈ డయల్ ఆకాశంలోని సూర్యచంద్రుల పొజిషన్‌ని, ఇతర ఖగోళ వివరాలని తెలియజేస్తుంది. కింద ఉన్న క్యాలెండర్ డయల్ నెలని చూపిస్తుంది. 14వ శతాబ్దంలో ప్రాగ్‌ని భూమికి కేంద్రంగా విశ్వసించేవారు. ఆ గడియారం మన సాలార్‌జంగ్ మ్యూజియమ్‌లో బొమ్మ బయటికి వచ్చి గంటలు కొట్టే లాంటి గడియారమే. ప్రాగ్ అంతా మరో పారిస్ లా అనిపించింది. కాకపొతే పారిస్ రాచరికంతో పాటు కొంత ఆధునిక ప్రపంచం కూడా కనిపిస్తుంది. ప్రాగ్ లో అన్నీ పాత వాసనలే ఉన్నాయి. మేము ఇవన్నీ తిరుగుతూ అసలు సమయం కూడా చూసుకోలేదు అప్పటికే సాయంత్రం 8 గంటలు అయ్యింది.అక్కడే కె ఎఫ్ సి లో డిన్నర్ కానిచ్చ్చేసి మళ్ళీ పోలాండ్ వైపు పయనమయ్యాం.



Saturday, November 21, 2015

నా ఐరోపా యాత్ర - 28 (నెదర్లాండ్స్)

ఆ రోజు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు మాత్రమే కాదు, స్వలింగ సంపర్కులకి సంభందించిన ఏదో ముఖ్యమైన రోజు. అక్కడున్న మీటింగ్ పాయింట్ దగ్గర మగవాళ్ళంతా చేరి ఒకళ్ళనొకళ్ళు ముద్దులు పెట్టుకుంటున్నారు. కొంతమంది బిగ్గరగా ఏదో మాట్లాడుతున్నారు. ఆ దృశ్యం చూడగానే భార్గవి భయపడింది. మాక్సిం చిన్న వాడు కావటంతో మార్చిన్ దంపతులు కూడా అటు వైపు చూడకుండా తీసుకొచ్చేసారు. నాకు దీని గురించి తెలియటంతో పెద్ద ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదటిగా " గే " వివాహాలని చట్టబద్దం చేసిన దేశం నెదర్లాండ్స్. ఏప్రిల్ 1, 2001 న దీనికి సంభందించిన చట్టాన్ని ఆమోదించారు. కాబట్టి ఇలాంటి దృశ్యాలు ఇక్కడ కనబడటం చాలా కామన్. తరువాత అమ్ స్టర్ డాం లో మేము నడిచిన దారిలో పింక్ పాయింట్ పేరుతో చాలా షెల్టర్స్ కనిపించాయి. లెస్బియన్లు , గే లు కలుసుకునే ప్రదేశాలు అవి.
మనకి నచ్చని పనులని , మన సంస్కృతి కి విరుద్ధమైన పనులని ఎదుటి వాళ్ళు చేస్తుంటే ఛీ ఛీ అనటం భావ్యం కాదు. మనం చేసే పనులు మనకి నచ్చినట్లే , అవతలవాళ్ళకి తాము చేసే పనులు వాళ్ళకీ నచ్చుతాయి. మన సంస్కృతి మనకెంత గొప్పదో, అవతలి వాళ్ళకి వాళ్ళ సంస్కృతి అంతే గొప్పది. ప్రతి మనిషిలోను కొన్ని విపరీతమైన భావాలు ఉంటాయి.వాటి మీద కామెంట్ చేసే హక్కు మనకి లేదని నేను భావిస్తాను.మనం చెయ్యని , చెయ్యలేని కొన్ని పనులని ఎదుటి వాళ్ళు చేస్తుంటే విమర్శించే సంస్కృతి మంచిది కాదు. ఆడవాళ్ళు జీన్స్ వేసుకుంటేనే నోళ్ళు నొక్కుకునే సంప్రదాయం నుండే మనం ఇంకా బయట పడలేదు. ఇక ఇలాంటి వాటిని మన దేశంలో చట్ట బద్దం చేసినా ప్రజలు ఆమోదించాలంటే ఇంకెన్నేళ్ళు పడుతుందో.అక్కడికి దగ్గరలోనే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అప్పటికే సమయం 9 గంటలు అయింది , అప్పుడప్పుడే చీకటి పడుతోంది. మేము ఆ ఇండియన్ రెస్టారెంట్ లోనే డిన్నర్ చేసేసి అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎగ్మొండ్ అనే ప్రాంతానికి బయలుదేరాం. నేను కావాలనే అక్కడ హోటల్ బుక్ చేశాను. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం ఒడ్డున పొలాలు, గుర్రపుశాలల మధ్యలో అత్యంత ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఈ హోటల్ ఉంది. అమ్ స్టర్ డాం నుండి 45 నిమిషాలు ప్రయాణించాక ఎగ్మొండ్ ప్రాంతానికి చేరుకున్నాం.అప్పటికే చీకటి పడింది. ఆ ప్రాంతం మొత్తం ఫార్మ్ హౌస్ లు గుర్రపు శాలలు ఉన్నాయి. అదొక చిన్న పల్లెటూరులా ఉంది. మేము విడిది చేసిన హోటల్ పేరు " స్టే ఓకే ". మేము వెళ్ళే సరికి కౌంటర్ లో ఒక 20 ఏళ్ల కుర్రవాడు ఉన్నాడు. ఇంటర్నెట్ లో బుక్ చేసిన పేపర్ చూపించగానే మాకు రూం కీస్ ఇచ్చాడు. కింద లాంజ్ లో రెస్టారెంట్ , బార్ ఉన్నాయి. రూం కి వెళ్లి ఫ్రెష్ అయిన తరువాత నేను మార్చిన్ కిందకి వచ్చాము. ఆ కుర్రవాడిని అడిగాను నువ్వు ఇక్కడ ఎన్నిరోజులనుండి పని చేస్తున్నావ్ అని. తానొక కాలేజి స్టూడెంట్ అని పగలు కాలేజికి వెళుతూ రాత్రి వేళ ఇక్కడ పనిచేస్తున్నా అని చెప్పాడు. నెలకి 600 యూరోలు జీతం వస్తుంది , దానితో నా చదువు , ఖర్చులు వెళ్ళిపోతాయి అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం లేవగానే ఆహ్లాదకరమైన ప్రకృతి మమ్మల్ని కనువిందు చేసింది. మాతో పాటు హోటల్ లో ఉన్న టూరిస్టులు ,పిల్లలు అందరూ బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో ఆడుతున్నారు. కొంతమంది జాకీలు గుర్రాలతో ఆ ప్రాంతంలో తిరుగుతుండటంతో పిల్లలంతా ఆ గుర్రాలతో ఫోటోలు దిగుతున్నారు. మేము కూడా కాసేపు వాళ్ళని చూస్తూ కాలం గడిపాం. తరువాత మాక్సిం తో కలిసి మేము కూడా ఒక ఫోటో దిగాం.
అప్పటికి ఉదయం 10. 30 నిమిషాలు అయ్యింది. మార్చిన్ ఒకసారి అట్లాంటిక్ సముద్రం చూద్దాం అన్నాడు. అక్కడికి దగ్గరలోనే ఉన్న సముద్రం దగ్గరికి వెళ్ళాం. అసలు ఆ నీళ్ళలో కాళ్ళు పెడితే గడ్డ కట్టేలా ఉన్నాయి. నేను చచ్చినా దిగను అని చెప్పా. మాక్సిం సముద్రం చూడగానే ఒకటే ఉత్సాహంతో పరుగులు పెడుతుంటే వాడితోపాటు భార్గవి ,మార్చిన్ ,కాషా కూడా కాసేపు ఆ నీళ్ళలో ఆడుకున్నారు. ఎంతసేపటికీ వాళ్ళు కదలకపోవటంతో నేనే తొందరపెట్టి తులిప్ తోటలకి వెళ్దాం అని అక్కడినుండి బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చాను.


15వ శతాబ్దంలో అభివృద్ధి చేసిన కూకెన్‌హఫ్ ఫ్లవర్ గార్డెన్ (Keukenhof) ప్రపంచంలో అతిగొప్ప ఉద్యానవనం. దీనినే ‘‘గార్డెన్ ఆఫ్ యూరోప్’’ అంటారు. దాదాపు 79 ఎకరాల విస్తీర్ణంలో  ఎటూ చూసినా పచ్చదనం, దానిమీద రంగురంగుల తులిప్ పుష్పాలు కనువిందు చేస్తాయి. దీన్ని చూసేందుకు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ మూడు నెలల్లో సందర్శకులతో తులిప్ గార్డెన్స్ కళ కళ లాడుతాయి. మేము బస చేసిన ఎగ్మొండ్ నుండి కూకెన్‌హఫ్ 60 కిలోమీటర్లు. మేము అక్కడికి చేరేటప్పటికి మధ్యాహ్నం 1 అయింది. కార్ పార్కింగ్ దొరకటానికే చాలా సమయం పట్టింది. గార్డెన్ లోకి ఎంట్రీ టికెట్ 16 యూరోలు. ప్రతి సంవత్సరం నవంబర్లో నెదర్లాండ్స్ రాజు ఈ గార్డెన్ లో తోలి మొక్కని నాటటం ద్వారా ఈ గార్డెన్స్ ని ప్రారంభిస్తారు.3 నెలలలో మొక్క పెరిగి పూవులు పూసాక దీని జీవిత కాలం మూడు నెలలు మాత్రమే. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే ఈ తోటలు ఉంటాయి.
మేము మే 5 న ఇక్కడికి వెళ్ళాము. మే 16 కల్లా ఈ గార్డెన్ మూతబడిపోతుంది.టికెట్ తీసుకుని లోపలి వెళ్ళగానే రకరకాల తులిప్ పూలు మాకు స్వాగతం పలికాయి. అసలు ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో కూడా చెప్పలేము. అక్కడ మాకు చాలామంది ఇండియన్స్ , అందునా తెలుగు వారు కనిపించారు. సాఫ్ట్ వేర్  ప్రాజెక్ట్ నిమిత్తం వచ్చిన మన కుర్రాళ్ళతో పాటు తెలుగు జంటలు బానే కనిపించాయి. 
మేము గార్డెన్ అంతా 2 గంటల పాటు తిరిగాము కాని మనం సినిమాల్లో చూసినట్లు పెద్ద పెద్ద తోటలు మాత్రం కనపడట్లా. ఒక్కో రంగు పువ్వులు 100 గజాల స్థలంలో పెంచబడి అలా ఆ గార్డెన్ అంతా దాదాపు 500 రకాల పుష్పాలు కనిపించాయి. తులిప్ గురించిన విశేషాలు , వాటికి సంభందించిన సాంకేతిక విశేషాల గురించి మ్యూజియం కూడా లోపల ఉంది.అంతా తిరిగాం కాని ఆ పెద్ద పెద్ద తోటలు చూడలేకపోయామే అనుకుంటూ అసంతృప్తిగా బయటకి వచ్చి కార్ లో మళ్ళీ అమ్ స్టర్ డాం కి బయలుదేరాం. ఈసారి గార్డెన్ వెనుక నుండి కార్ వెళుతోంది. ఒక్కసారిగా కొన్ని వందల ఎకరాల్లో ఉన్న తులిప్ తోటలు కనిపించాయి. అచ్చం మన సినిమాల్లో పాటల్లో కనిపించినట్లే ఉన్నాయి. ఒక్కసారిగా అందరం మళ్లీ వెళ్దాం అని గట్టిగా అరవగానే మార్చిన్ కార్ వెనక్కి పోనిచ్చాడు. అయితే ఆ పొలాలకి దగ్గరగా కార్ పార్కింగ్ లేదు. దాదాపు కిలోమీటర్ ముందు పార్క్ చేసి నడుచుకుంటూ ఆ తోటల దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఎంట్రీ టికెట్ కూడా లేదు , అందరూ ఆ తోటల మధ్యలోకి వెళ్లి ఫోటో లు వీడియోస్ తీసుకుంటున్నారు. కొత్తగా పెళ్ళైన ఒక జంట వెడ్డింగ్ డ్రెస్ లోనే ఆ తోటల్లో ఫోటో షూట్ చేసుకుంటున్నారు. 

ఇంతకుముందు మ్యూజియం సందర్శించిన అనుభవాల దృష్ట్యా భార్గవి , కాషా నాతో పాటు ఎక్కడికోచ్చినా మ్యూజియంకి మాత్రం రాము అని చెప్పేయటంతో అమ్ స్టర్ డాంలో  కొన్ని మ్యూజియాలు చూద్దామనుకుని కూడా ఆ ఆలోచన విరమించుకున్నాను. కాకపొతే అన్నే ఫ్రాంక్ మ్యూజియంకి మాత్రం షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. నేను ఒక్కడినే వెళ్లి చూసి రావాలని, తామంతా బయటే ఉంటామనే ఒప్పందంతో ఆ తోటల మధ్యకాసేపు గడిపి అన్నే ఫ్రాంక్ మ్యూజియం చూడటానికి మళ్ళీ అమ్ స్టర్ డాం కి బయలుదేరాం. ఒక పక్క సమయం అయిపోతుందేమో అనే ఆందోళనతో నా మనసు అంతా కంగారుగా ఉంది. ఎందుకంటే నా వరకు నాకు అన్నే ఫ్రాంక్ మ్యూజియం చూడకపోతే నా యాత్రకి పరిపూర్ణత లేదు. అంతలా నన్ను కదిలించింది ఆ డైరీ అఫ్ యంగ్ గర్ల్ కధ. 

నా అదృష్టం కొద్దీ మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఎంట్రీ ఉంది. కాషా, భార్గవి , మాక్సిం కార్ లోనే ఉంటామన్నారు. మార్చిన్, నేను కలిసి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాం. లోపల ఫోటోలు నిషేధం. ఆశ్విత్జ్ కాంప్ లో లానే ఇక్కడ కూడా అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. సన్నటి ఇరుకు మెట్ల గుండా ఆ ఇంటి పైభాగానికి చేరుకున్నాం. మన ఇళ్ళలో అటక మాదిరిగానే ఆ ఇంటి పై అంతస్తులో చెక్కతో కట్టిన అటక మీద అన్నే ఫ్రాంక్ కుటుంబం 25 నెలలు గడిపింది. యుద్ధం ముగియటానికి కేవలం మూడు నెలల ముందే ఒక ఆగంతకుడు నాజీలకి సమాచారం ఇవ్వటంతో ఒక రాత్రి పూట నాజీలు దాడి చేసి అన్నే ఫ్రాంక్ కుటుంబాన్ని కాన్సంట్రేషన్ కాంపుకి తరలించారు.యుద్ధం ముగిసేలోపే అన్నేఫ్రాంక్ తండ్రి తప్ప కుటుంబం అంతా మరణించారు. 1980 వరకు అన్నే ఫ్రాంక్ తండ్రి బతికే ఉన్నాడు. ఆ సమయంలోనే ప్రభుత్వం ఈ ఇంటిని మ్యూజియం గా మార్చి అన్నే ఫ్రాంక్ వస్తువులని , ఆ అరలని అలాగే ఉంచి పరిరక్షిస్తోంది. లోపల అన్నే రాసిన డైరీ , అన్నే తో పాటు కాంపులో కొన్నాళ్ళు గడిపిన తన మిత్రుల జ్ఞాపకాలతో కూడిన వీడియో చూడవచ్చు. ఆ ఇంటికి బయట కొద్ది దూరంలోనే అన్నేఫ్రాంక్ విగ్రహం ఉంది.హౌస్ అంతా చూశాక బరువెక్కిన హృదయంతో బయటకి వచ్చాం. 

అక్కడినుండి  IAMSTERDAM అనే అక్షరాలతో కూడిన ఒక బోర్డ్ ఉన్న చోటుకి వెళ్ళాం. సందర్శకులంతా అమ్ స్టర్ డాం ని సందర్శించిన గుర్తుగా అక్కడ ఫోటో దిగుతారు. మేము కూడా అక్కడికి వెళ్లి ఫోటో తీసుకున్నాం.అప్పటికి సమయం సాయంత్రం 9.30 నిమిషాలు అయ్యింది. 

చీకటి అప్పుడప్పుడే పడుతోంది. మేము మింజు జేర్జ్ కి వెళ్ళాలంటే అక్కడినుండి 800 కిలోమీటర్లు ప్రయాణించాలి. తొందరపడకుండా మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ మే 6 వ తేది ఉదయానికి పోలాండ్ చేరుకున్నాం. 
వచ్చేవారం చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్. 

Friday, November 20, 2015

నా ఐరోపా యాత్ర - 27 (నెదర్లాండ్స్)

బ్రస్సెల్స్ నుండి నెదర్లాండ్స్ రాజధాని అమ్ స్టర్ డాం కి 250 కిలోమీటర్లు. సరిగా మధ్యాహ్నం 1.30 గంటలకి ఆటామియం నుండి బయలుదేరాం. దాదాపు గంటన్నర ప్రయాణించాక గూగుల్ మాప్స్ లో చూస్తే బెల్జియం - నెదర్లాండ్స్ బోర్డర్ అని కనిపించింది. హైవే మీద ఉన్న మెక్ డొనాల్డ్స్ దగ్గర లంచ్ కోసం కార్ ఆపాడు మార్చిన్. గంట తరువాత మా ప్రయాణం మళ్ళీ ప్రారంభమైంది.

క్రీ.పూ. 53లో జూలియస్ సీజర్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించి పరిపాలన చేశాడు. దాదాపు నాలుగు శతాబ్దాలు రోమన్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. క్రమంగా ఫ్రాంక్ రాజులు రోమన్‌లను పారద్రోలి ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. క్రమక్రమంగా వివిధ రాజులు పాలిస్తూ వచ్చారు. 6వ శతాబ్దంలో ఫ్రిసియన్ రాజులు పాలించారు. తిరిగి 10వ శతాబ్దంలో రోమన్‌లు ఈ ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించారు. కాని వీరి పాలనలో ఐకమత్యం లేక స్థానికంగా చిన్న చిన్న డచ్చివారి ప్రైవేటు సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. 13వ శతాబ్దంలో ఇండోనేయల్, ఫ్రెంచి రాజులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. 17వ శతాబ్దంలో డచ్చి పాలకులు మొత్తం నెదర్లాండ్స్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. వీరి పరిపాలనను గోల్డెన్ ఏజ్ అని పిలుస్తారు. 17, 18 శతాబ్దాలలో బటావియన్ రాజకుటుంబం ఈ ప్రాంతాన్ని పాలించింది. 19వ శతాబ్దంలో ఇంగ్లండ్, జర్మనీలు పరిపాలించాయి. క్రీ.శ.1581లోనే స్పెయిన్ నుండి స్వతంత్రదేశంగా ప్రకటింపబడినా, 1954లో స్వతంత్ర దేశంగా ఏర్పాటయింది.ఈ దేశంలో జనసాంద్రత ఎక్కువ. ఒక చదరపు కిలోమీటరుకు 404 మంది నివసిస్తున్నారు. ప్రజలు డచ్చి భాషను మాట్లాడుతారు ఇక్కడి ప్రజలు వాళ్ళ స్వంత భాషతో పాటు జర్మన్, ఫ్రెంచి, ఇంగ్లిష్ వంటి విదేశీ భాషలు కూడా నేర్చుకుంటారు. ఇక్కడి ప్రజలంతా క్రైస్తవులు, వీరిలో క్యాథలిక్కులు అధికం. జనాభాలో అధికశాతం ప్రజలు దేవుణ్ణి నమ్మరు. దేశంలో బౌద్ధులు, హిందువులు ముస్లిముల జనాభా కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఉంది.

నెదర్లాండ్స్ లో ప్రవేశించగానే మనకి కనిపించేవి విండ్ మిల్లులు. అంటే పెద్ద ఫాన్ ని ఒక టవర్ కి పైన బిగించి అది గాలికి తిరుగుతున్నపుడు ఆ శక్తి తో కింద పిండి మర నడిపిస్తారు. పూర్వ కాలంలో రొట్టెలు తయారు చేయటానికి పిండిని ఇలాగే తయారు చేసేవారు. ఇప్పటికీ చాలా చోట్ల ఇలాంటి గాలి మరలు కనిపిస్తాయి. నెదర్లాండ్స్ సంస్కృతి ని కూడా ఇవి తెలియచేస్తుండటంతో కొన్ని పాత మిల్లులని అలాగే ఉంచేశారు. భార్గవి , కాషా నెదర్లాండ్స్ లో ఉండే తులిప్ తోటల ని చూడబోతున్నామనే ఉత్సాహంతో వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆడవాళ్ళకి సహజంగానే పూలంటే ఇష్టం అందునా తులిప్ అందాలని వెండితెరమీద చూసిన తరువాత ఒక్కసారైనా ఆ తోటల్లో విహరించాలని అందరికీ ఉంటుంది. కాని నా మనసంతా అన్నే ఫ్రాంక్ హౌస్ చుట్టూనే తిరుగుతోంది. నన్ను ఈ యాత్ర చేయటానికి , ఈ పుస్తకం రాయటానికి ప్రేరేపించిన రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన రోజు ( మే 4, 1945) రోజే నా ఐరోపా యాత్ర చివరి మజిలీ చేరుకోవటం , అన్నిటి కంటే ఆఖరున నన్ను అత్యంత ప్రభావితం చేసిన అన్నే ఫ్రాంక్ హౌస్ సందర్శించటం అక్కడే మా యాత్రకి ఆఖరి రోజు కావటం అంతా యాదృచ్చికం. రెండవ ప్రపంచ యుద్ధంలో కాన్సంట్రేషన్ కాంపుల్లో చంపబడ్డ లక్షలాది యూదులు , చిన్నారులలో అన్నే ఫ్రాంక్ అనే చిన్నారి కధ మాత్రమే ప్రపంచానికి తెలిసింది.1939 -1945 మధ్య కాలం లో జరిగిన మానవ హననంలో లక్షలాది యూదు చిన్నారుల జీవితాలు నాజీల దౌష్ట్యం కారణంగా చిద్రమై పోయాయి. ఎన్నో చిన్ని గుండెలు వారి ఇనప బూట్ల పాదాల కింద నలిగిపోయాయి. 1929 జూన్ 12 న జర్మనీలో Frankfurt లో  జన్మించింది అన్నే ఫ్రాంక్ . వారిది యూదు కుటుంబం . తండ్రి బిజినెస్ మాన్, అందమైన కుటుంబం, 1935 లో నియంత హిట్లర్ అధికారం లోకి వచ్చాడు.1939 లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది .జర్మనీ లో యూదులకి రక్షణ లేదని అర్ధమైన వెంటనే అన్నే ఫ్రాంక్ తండ్రి తమ కుటుంబాన్ని హాలండ్ కి మార్చాడు. తన వ్యాపారాన్ని తోటి జర్మన్ మిత్రులకి అప్పగించాడు. యూదులు ఎక్కడున్నా వేటాడి చంపించాడు హిట్లర్ .1942 లో అన్నే కుటుంబం రహస్య స్తావరాలలో దాక్కోవాల్సిన గతి పట్టింది .తల్లి అన్నే , సోదరి లకు కొందరు ఆశ్రయం ఇచ్చి దాచారు .ఒక అపార్ట్మెంట్ లో పై భాగంలో ఉన్న చిన్న అరల్లో 25 నెలలు జీవితాన్ని గడిపింది.ఈ విషయాన్ని అన్నే secret annex అన్నది .1942 జూన్ పన్నెండు న ఆమె పుట్టిన రోజున ఎవరో ఒక డైరీని కానుక గా ఇచ్చారామెకు .దానినే తన స్నేహితుని గా భావించి దిన చర్య రాయటం ప్రారంభించింది .అలా ఆ రెండు సంవత్సరాల్లో ఆమె రాసిన తన దినచర్య , తాను గడిపిన ఆ రెండేళ్ళ రహస్య జీవితం గురించి రాసిన విశేషాలు ఎ డైరీ ఆఫ్ యంగ్ గర్ల్ గా పేరుగాంచింది. కాని దురదృష్టవశాత్తు ఎవరో వీళ్ళ గురించి సమాచారం ఇవ్వటంతో నాజీలు 1944 సెప్టెంబర్ 3 న దాడి చేసి కుటుంబం మొత్తాన్ని పోలాండ్ కు గొడ్లను తోలుకు వెళ్లి నట్లు తోలుకు వెళ్ళారు . ఆడవాళ్ళను ,పిల్లల్ని బట్టలు ఊడ దీయించి వర్షం లో నిలబెట్టారు. అన్నే ఫ్రాంక్ తండ్రిని మాత్రం వేరే కాంపుకి తరలించారు. అన్నే ఫ్రాంక్ అక్క మరియు తల్లి తన కళ్ళముందే బెల్షన్ కాంపులో చనిపోయారు. కొన్ని రోజులకి 16 వ ఏడు రాకుండానే అన్నే ఫ్రాంక్ టైఫాయిడ్ సోకి 1945 మార్చ్ లో అదే కాంప్ లో మరణించింది.

యుద్ధ సమయం లో ఎవరైనా డైరీలు రాసుకొని ఉంటె యుద్ధం పూర్తీ అయిన తర్వాత వాటిని ప్రచురిస్తామని 1944లో రేడియో లో ప్రకటన వచ్చింది . 1945 లో యుద్ధం ముగిశాక బ్రిటిష్ వాళ్ళు అందర్నీ వదిలేశారు. అయితే వేరే కాంప్ లో ఉన్న అన్నే ఫ్రాంక్ తండ్రి మాత్రం బతికే ఉన్నాడు. ఆయన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అన్నే రాసిన డైరీ దొరికింది .దానిని ఆయన 1947 లో కొద్దిగా మార్చి ప్రింట్ చేస్తే 25 మిలియన్ల  అమ్ముడయాయి ఎందరో నాజీ నిర్బంధాన్నిగురించి, వారు చేసిన దారుణాలను గురించి డైరీలు రాసినా అన్నే ఫ్రాంక్ డైరీ కున్న ప్రాధాన్యత దేనికీ రాలేదు . దాదాపు అరవై భాషల్లోకి అనువాదం పొందింది . బైబిల్ తర్వాతా అన్నే డైరీకి అంతగిరాకీ  వచ్చింది .దక్షిణాఫ్రికా స్వాతంత్ర ఉద్యమ నేత ,అధ్యక్షుడు నెల్సన్ మండేలాజైలు లో ఉండగా  అన్నే ఫ్రాంక్ డైరీని తానూ చదివానని ఏంతో  ప్రభావితం చేసిందని తోటి ఖైదీలకు కూడా చదివి వినిపించానని రాశాడు. ఈ పుస్తకమ్మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. నటాలీ పోర్ట్‌మన్ అనే అమెరికన్ నటి 1997లో ది డైరీ ఆఫ్ అన్నే ఫ్రాంక్ పుస్తకం ఆధారంగా నిర్మించిన బ్రాడ్‌వే చిత్రంలో అన్నే ఫ్రాంక్ పాత్ర పోషించింది. నటాలీ పోర్ట్‌మన్ కూడా రెండవప్రపంచ యుద్ధం తరువాత ఇజ్రాయిల్ వెళ్లి స్థిరపడ్డ యూదు కుటుంబానికి చెందిన యువతి. ఈ డైరీ కి ప్రెసిడెంట్ రూస్ వెల్ట్ భార్య ముందు మాట రాసింది.అన్నే ఫ్రాంక్ తండ్రి  81 వ ఏట 1980 లో చని పోయాడు .అన్నే పేర ఒక ట్రస్ట్ ఏర్పడింది దాని ద్వారా ఎన్నో ప్రజోపకారమైన పనులు చేస్తున్నారు . ఆమె ఇంటిని స్మ్రుతి చిహ్నం గా మార్చారు . ప్రతి ఏటా కనీసం ఆరు లక్షల మంది దాన్ని సందర్శిస్తారు . అన్నే నివసించిన అరలు , ఆమె తాలూకు వస్తువులు , డైరీ ఒరిజినల్ ప్రతి , అన్నే ఫ్రాంక్ చిన్న వీడియో క్లిప్ ఈ ఇంట్లో చూడవచ్చు. ఇప్పుడు నేను చూడాలని అనుకున్నది అన్నే ఫ్రాంక్ మ్యూజియంగా పిలవబడుతున్న ఈ సీక్రెట్ అనెక్స్ అనే హౌస్. మార్చిన్ కి ఈ కధంతా తెలుసు , ఇలాంటి కొన్ని లక్షల మంది పిల్లలు చనిపోయారు కాని అన్నే ఫ్రాంక్ తండ్రి ధనవంతుడవ్వటం వల్ల ఇంతటి ప్రాచుర్యం వచ్చిందంటాడు మార్చిన్. ఇలా నా ఆలోచనలు అన్నే ఫ్రాంక్ చుట్టూ తిరుగుతుండగానే మేము అమ్ స్టర్ డాం లోకి ప్రవేశించాం. ఆరోజు బాగా చలిగా ఉంది అక్కడ. మేము బయలుదేరినప్పుడు బ్రస్సెల్స్ లో అంత చలిగా లేదు. మేము నేరుగా అన్నే ఫ్రాంక్ హౌస్ దగ్గరికి వెళ్ళాం, కాని అప్పటికే సమయం సాయంత్రం 5 గంటలు అవ్వటంతో ప్రవేశం నిలిపివేశారు. ఎలాగు మేము బస చేసేది ఆ రాత్రికి నెదర్లాండ్స్ లోనే. రేపు చూద్దాంలే అని సిటీ చూడటానికి కాలి నడకన బయలుదేరాం. 
అమ్ స్టర్ డాం ఇంచుమించు వెనిస్ లాగే అనిపించింది. అమ్ స్టాల్ అనే నది ఈ నగరం గుండా ప్రవహిస్తోంది. ఈ నది కెనాల్ లోనే బోటులో సందర్సకులంతా విహారానికి వెళుతున్నారు. ఒకరకంగా ఇది Venice of north europe అనవచ్చు. ఓపెన్ బోట్స్ తో పాటు హౌస్ బోట్స్ కూడా ఈ కెనాల్స్ లో ప్రయాణికులని చేరవేస్తున్నాయి. మాకు కార్ల కంటే ఎక్కువగా సైకిళ్ళు కనిపించాయి.ఎక్కువమంది సైకిల్లనే వాడుతున్నారు. సైకిళ్ళు అద్దెకిచ్చే షాపులు ఎక్కువగానే ఉన్నాయి. గంటకి అద్దె 5 యూరోలు అని రాసి ఉంది ఒకచోట. అలా మేము నడుస్తుండగానే జనాలంతా ఒకే వైపు వడి వడిగా పరుగులు పెట్టటం కనిపించింది. ఏమి జరుగుతోందో అని మేము కూడా అటు వైపు వెళ్ళాం. తీరా చూస్తే అది అమ్ స్టర్ డాం నగర కూడలి. అతి పెద్దదైన రాజ భవనాలు , టుస్సాడ్ మ్యూజియం మధ్యలో ఈ సిటీ కూడలి ఉంది. 15 నిమిషాల్లో దాదాపు 10000 మంది పోగయ్యారు. మాకు అప్పుడు కాని అర్ధం కాలేదు, బ్రస్సెల్స్ లో మేము చూసిన యుద్ధం ముగిసిన రోజు వేడుకలు ఇక్కడ కూడా జరుగుతున్నాయి. అందరి మొహాల్లో విషాదం. కొంతమందైతే ఏడుస్తూ ఉన్నారు. పోలీసులు అంతా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. కాసేపటికి నెదర్లాండ్స్ రాజు తన సతీమణితో కలిసి ఆ కూడలి లో ఉన్న ఒక స్థూపం దగ్గరికి వచ్చాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన యూదులకి సైనికులకి అశ్రు నయనాలతో నివాళి అర్పించారు. వారి ఆత్మకి శాంతి కలగాలని 2 నిమిషాలు అందరూ మౌనం పాటించారు. 10000 మంది ఓపెన్ ఏరియా లో ఉన్నా సూది పడినా విన్పించే నిశ్శబ్దం ఆవరించింది. మేము కూడా వారితోపాటు అక్కడే నిలబడి నివాళి అర్పించాము.
అప్పటికి సమయం సాయంత్రం 8 గంటలు అయ్యింది. ఇంకా చీకటి పడలేదు సూర్యుడు అప్పుడే అస్తమించే దశలో ఉన్నాడు. మేము అక్కడినుండి మళ్ళీ నడుచుకుంటూ మా కార్ పార్కింగ్ దగ్గరికి వస్తున్నాం. అమ్ స్టర్ డాం లో చెప్పుకోవాల్సింది కాఫీ షాప్స్. నాకు వాటి వెనుక కధ తెలియదు , మార్చిన్ నవ్వుతూ అడిగాడు కాఫీ తాగుదామా అని. ప్రతి కాఫీ షాపులోనూ విపరీతంగా జనాలు ఉన్నారు. సిగరెట్ పొగ, కాఫీ వాసనలతో ఆ షాపులన్నీ సందడిగా ఉన్నాయి. నన్ను మార్చిన్ ఒక షాప్ లోకి తీసికెళ్ళాడు. అక్కడ ఒక ఆకు బొమ్మ వేసి Its Legal Here అని రాసి ఉంది. దానితోపాటు గాజు సీసాల్లో రకరకాల ఎండిన ఆకులు ఉన్నాయి. వాటితో తయారు చేసే రకరకాల కాఫీ మెనూ ఉంది అక్కడ. మార్చిన్ ఎందుకు నన్ను కాఫీ తాగుతావా అని అడిగాడో అర్ధం అయ్యింది. అవన్నీ మన గంజాయి తరహా రకరకాల ఆకులు. ఆ కాఫీ తాగితే ఒకరకమైన నషా వస్తుంది. అక్కడ ఇదంతా కామన్ మరియు ప్రభుత్వ పరంగా అనుమతి కూడా ఉంది. అన్నిటితో పాటు నేను గమనించిన మరో ఆసక్తి కరమైన అంశం, అక్కడ అన్ని షాపుల్లో మన వినాయకుడి ఫోటోలు ఉన్నాయి. మార్చిన్ కి కూడా ఆ ఫోటో తెలియదు అప్పుడు నేను ఆవర్ ఇండియన్ గాడ్ అని చెప్పాను. అవి ఎందుకు పెట్టారో అడగాలని రెండు మూడు షాపుల్లోకి వెళ్లాను కాని అక్కడ వాతావరణం చూసి ధైర్యం చాలలేదు.
అలా చూసుకుంటూ ముందుకి రాగానే ఒక మీటింగ్ పాయింట్ కనపడింది. 200 మందికి పైగా అబ్బాయిలంతా అక్కడ ఉన్నారు. కొంతమంది అక్కడ నదిలో దీపాలు వదులుతున్నారు. ఏం జరుగుతోందో చూద్దామని దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఎదురైన దృశ్యం చూసి భార్గవి నా చేతిని గట్టిగా పట్టుకుని ఛీ ఛీ అంటూ వెనక్కి తిరిగింది. మార్చిన్, కాషా కూడా ఏమైంది అంటూ వచ్చి వాళ్ళు కూడా ఆ దృశ్యాన్ని చూసి మాక్సిం కళ్ళు మూసేసి వెనక్కి తీసుకొచ్చేసారు. ఇంతకీ ఏం జరుగుతోంది అక్కడ ? 

Saturday, October 31, 2015

నా ఐరోపా యాత్ర - 26 (బెల్జియం )

లక్సెంబర్గ్ నుండి బ్రస్సెల్స్ 240 కిలోమీటర్లు. మేము బయలుదేరేటప్పటికి మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది. నేరుగా ప్రయాణించి సాయంత్రం 6 గంటలకల్లా బ్రస్సెల్స్ చేరుకున్నాం. ముందు రోజు రాత్రి కూడా నిద్ర లేకపోవటంతో నేరుగా హోటల్ కి చేరుకొని ఆ రోజుకి విశ్రాంతి తీసుకున్నాం. మరుసటి రోజు ఉదయం మే 4 వ తేది 2013 మా అదృష్టమో లేక యాద్రుచ్చికమో తెలియదు కాని ఆ రోజున మేము బ్రస్సెల్స్ లో ఉండగలిగాం. హిట్లర్ పాలనకి రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన నరమేధానికి చరమ గీతం పాడిన రోజు అది. 1945 మే 4 న రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ ఏడాది మొదటి నెలల్లో ఐరోపా పడమటి భాగంలో జర్మనీ చివరి సారిగా మిత్ర రాజ్యాల సేనలపై చేసిన పలు ఎదురు దాడులు విఫలమయ్యాయి. ఆ ఏడాది మే 4 న సోవియెట్ సేనలు జర్మనీ రాజధాని బెర్లిన్ నగరాన్ని ఆక్రమించటంతో హిట్లర్ ఆత్మ హత్య చేసుకున్నాడు. దానితో జర్మనీ మిత్ర రాజ్యాలకు లొంగిపోయింది.ఈ యుద్ధానంతరం అటువంటి మరో యుద్ధాన్ని నివారించే ఆశయంతో ఐక్య రాజ్య సమితి నెలకొల్పబడింది. మరోవంక, ఈ యుద్ధం కారణంగానే  ఐరోపా దేశాలన్నీ ఏకీకరణ దిశగా అడుగులు పడటం మొదలయింది. అటువంటి చారిత్రాత్మక రోజున ఐరోపా రాజకీయ రాజధాని అయిన బ్రస్సెల్స్ లో ఉండటం మా అదృష్టమనే చెప్పాలి.
ఐరోపా రాజకీయ రాజధాని అని ఎందుకన్నానంటే యూరోపియన్ సమాఖ్య పార్లమెంట్ భవనం బ్రస్సెల్స్ లోనే ఉంది. ఐరోపా సభ్య దేశాల నుండి ఎన్నికైన ప్రతినిధులంతా ఇక్కడి పార్లమెంట్ భవనంలోనే సమావేశమవుతారు.ఐరోపా సమాఖ్య తీసుకునే పలు కీలకమైన నిర్ణయాలకి ఓటింగ్ ఇక్కడే జరుగుతుంది. ఈ సమాఖ్య రూప కల్పనలో కీలకంగా వ్యవహరించిన 5 దేశాల్లో బెల్జియం ఒకటి. అందుకే ఈ భవనాన్ని ఇక్కడ నిర్మించారు. 1952 లో ఇక్కడ తొలి సమావేశం జరిగింది. కొత్త దేశాలు ఈ యూనియన్ లో చేరాలన్నా, ఏదైనా సంక్షోభంలో ఉన్న దేశాలని ఆదుకోవాలన్నా ఈ పార్లమెంట్లో ఓటింగ్ ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు. మేము మాములుగానే ఆ పార్లమెంట్ చూద్దామని ఉదయం 9 గంటలకల్లా అక్కడికి వెళ్ళాం. ఆరోజు అంతా అక్కడ సందడిగా ఉంది జనాలంతా పార్లమెంట్ ముందు క్యూ లో నిలబడ్డారు. అప్పుడే మాకు మే 4 అనే విషయం గుర్తొచ్చింది. ప్రతి సంవత్సరం ఆ రోజున ప్రజలందరినీ పార్లమెంట్ చూడటానికి అనుమతిస్తారు. అంతే కాదు నేరుగా పార్లమెంట్ సమావేశాలు జరిగే హాల్ లోకి వెళ్లి కూర్చోవచ్చు. పార్లమెంట్ పని తీరు , ఓటింగ్ జరిగే ప్రక్రియ అంతా అక్కడ చూడవచ్చు. నేను మాక్ ఓటింగ్ జరిగే చోటుకి వెళ్లి అసలు ఆ విధానం ఎలా ఉంటుందో అని చూసి నేను కూడా ఓటింగ్ లో పాల్గొన్నాను. పార్లమెంట్ హలో కూర్చొని మాక్ పార్లమెంట్ లో మాట్లాడటం మరిచిపోలేని అనుభవం.




హాల్ బయట ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెండవ ప్రపంచ యుద్ధం తాలూకు ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. యుద్ధం ముగిసిన దగ్గరనుండి ఐరోపా సమాఖ్య ఏర్పాటు వరకు జరిగిన వివిధ ఘట్టాలని ఫోటోల రూపంలో వలయాకారపు ఓపెన్ ఆడిటోరియం లో చుట్టూ ఉంచారు. సందర్శకులందరికీ గుర్తుగా వారి ఫోటోని ప్రింట్ చేసి షర్ట్స్ ఉచితంగా ఇస్తున్నారు. సావనీర్లు, ఫోటోలకైతే లెక్కే లేదు. మేము కూడా ఆ పార్లమెంట్ సందర్శించినట్లు గా వారి నుండి ఒక అధికారిక ఫోటో తీసుకున్నాం. సందర్శకులంతా అక్కడ ఒక పచ్చటి పలక పై తమ సందర్శనకి గుర్తుగా సంతకాలు చేస్తున్నారు. మేము కూడా మా పేర్లు రాసి ఇండియా అని రాసాము. దాదాపు 4 గంటల సమయం అక్కడే గడిపి అక్కడినుండి సిటీ చూద్దామని బయటకి వచ్చాము. బెల్జియం లో ఎక్కువశాతం మంది కాథలిక్కులు అయినా అన్ని మతాల వారు ఇక్కడ నివసిస్తున్నారు. 2007 లో బౌద్ధులు తమ మతాన్ని గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బెల్జియంలో ఐదు లక్షల మంది ముస్లింలు ఉన్నారు. అక్కడక్కడా మసీదులు కూడా కనిపించాయి, కాకపొతే మిగతా దేశాల్లో కనిపించే ఆకృతిలో కాకుండా ఒక బిల్డింగ్ లో ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో బురఖాని నిషేదించిన మొట్ట మొదటి యూరప్‌ దేశంగా బెల్జియం నిలిచింది. 2010 లో బ్రస్సెల్స్‌ ఫెడరల్‌ పార్లమెంటు దేశీయ వ్యవహారాల కమిటీ పాక్షికంగా, లేదా సంపూర్ణంగా బహిరంగ ప్రదేశాల్లో బురఖాని ధరించకుండా నిషేధం విధిస్తూ శాసనంద్వారా ఏకగ్రీవ తీర్మానం చేసింది. మేము వెళుతుండగా St. Michael and St. Gudula Cathedral కనిపించింది. ఇది అత్యంత పురాతనమైన ఎత్తైన చర్చి. 11 వ శతాబ్దంలో నిర్మాణం ప్రారంభిస్తే 1519 నాటికి గాని పూర్తి కాలేదు.కారు లోనుండే ఆ చర్చి ఫోటో తీసుకున్నాను.

అక్కడినుండి నేరుగా ఆటామియం దగ్గరికి వెళ్ళాము. 1958 లో ఒక ఎగ్జిబిషన్ నిమిత్తం దీనిని నిర్మించారు. బ్రస్సెల్స్ ఎక్స్ పో భవనం ముందు కొద్ది దూరంలో ఇది ఉంది. దీని ఎత్తు 335 అడుగులు, బెల్జియం లో ఇది వింతైన నిర్మాణం. పైకి వెళ్ళటానికి మెట్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఒక మ్యూజియం. పైకి వెళ్ళాలంటే టికెట్ ఉంది.

దీనికి పక్కనే మినీ యూరోప్ మ్యూజియం కూడా ఉంది. ఒక్కో దేశం నుండి ఒక్కో నిర్మాణాన్ని తీసుకుని వాటి మినీ రూపాలని ఇక్కడ నిర్మించారు. యురోపియన్ సమాఖ్యలో ఉన్న అన్ని దేశాల ఐకానిక్ భవనాలన్నీ మినియెచర్ రూపంలో ఇక్కడ చూడవచ్చు. బ్రస్సెల్స్ వెళ్తే మాత్రం చాక్లెట్ వాఫ్ఫెల్ తినకుండా మాత్రం రావద్దు. ఇక్కడ ఈ ఐటెం చాలా ఫేమస్ ఆటామియం పక్కనే చిన్న వాన్ లో వాఫెల్ అమ్ముతుంటే అక్కడే తిన్నాం. అప్పటికే హోటల్ చెక్ అవుట్ చెయ్యటంతో అక్కడినుండి నేరుగా నెదర్లాండ్స్ రాజధాని అమ్ స్టర్ డాంకి బయలుదేరాం.